Srisailam Gates Lifted: శ్రీశైలానికి భారీ వరద - 10 గేట్లు ఎత్తివేత
discharge of flood continues at srisailam: శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ జలాశయానికి వరద ఉద్ధృతి భారీగా పెరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Srisailam 10 gates lifted: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి... భారీ స్థాయిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం పది గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 2,20,804 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 2,09,663 క్యూసెక్కులుగా ఉంది.
పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 884.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 215.66 కొనసాగుతోంది. అటు శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
సాగర్ లో పరిస్థితి ఇలా...
nagarjuna sagar dam gates open: మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండటంతో... భారీ స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.05లుగా ఉండగా.. ప్రస్తుతం 309.95గా ఉంది. ఇక ఇన్ ఫ్లో 3,79,746 క్యూసెకులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 3,38,246 క్యూసెకులుగా ఉంది. ఇక ఏపీలోని పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, బ్రహ్మసాగర్, గుండ్లకమ్మ, సోమశిల ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి.
సాగర్ కాల్వకు గండి...
బుధవారం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో గండి పడింది. సాగర్ కాల్వకు నీటి విడుదల గత నెల జులై 28 నుంచి కొనసాగుతుంది అయితే కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో పాటు మట్టికట్ట బలహీనం కావడంతో ఈ గండి పడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కాల్వలోకి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అటుగా వచ్చిన రైతులు గండి పడడం చూసి ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
వారు జలాశయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నీటి విడుదలను ఆపేశారు. అయితే కాల్వలో ఉన్న నీరు మొత్తం గండి ద్వారానే బయటకు వెళ్లిపోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. కాల్వ కట్ట దిగువ ప్రాంతంలోని రైతులు పొలాల్లో వరి నాట్లు వేశారు. ఫలితంగా వందల ఎకరాల్లో పొలాలన్ని నీట మునిగిపోయాయి. నీటి ప్రవాహానికి వరి నాట్లు కొట్టుకుపోయే అవకాశం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిడమనూరులో 20 నివాసాల్లో ఉన్న ప్రజలను నర్శింహలగూడెంలో ఉన్న లోతట్టు ప్రజలను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు.