CBN On Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత అమరావతి విషయంలో చంద్రబాబు కీలక ప్రకటన చేవారు.
పదేళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఇవన్నీ గుర్తు చేసుకుంటూ కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రకటించారు.
మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఇన్నాళలు ఆటలాడారని, అమరావతి మాత్రమే రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందన్నారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ప్రత్యేక నగరంగా ఆధునిక నగరంగా తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. విశాఖపట్నం జనసేన, బీజేపీ, టీడీపీకి ముఖ్యమని, 2014లో హరిబాబు ఎంపీగా గెలిచారని, 2019లో టీడీపీకి నాలుగు అసెంబ్లీ సీట్లను గెలిపించిన నగరం, ప్రజల్లో గణనీయమైన అభిమానం జనసేనకు ఉందన్నారు.
ఎన్నికల్లో విశాఖపట్నం రాజధాని చేస్తాను, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామని ప్రచారం చేసినా నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ అని అభినందించారుజ తాను విశాఖను మర్చిపోయే సమస్య లేదని, తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కర్నూలును కూడా మర్చిపోయేది లేదన్నారు. జ్యూడిషియల్ క్యాపిటల్ చేస్తామని కూడా ఏమి చేయలేదన్నారు. రాయలసీమలో వన్సైడ్ ఎన్నికలు జరిగాయని, ఊహించని మెజార్టీని ఇచ్చారన్నారు. ఊహించని మెజార్టీని సీమ ప్రజలు కట్టబెట్టారన్నారు.
ఇకపై సిఎం వస్తుంటే చెట్లు కొట్టేయడం, పరదాలు కట్టడంఉండవని, సిఎంగా ఉన్నా సామాన్య వ్యక్తులుగానే మీ దగ్గరకు వస్తామని, హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదన్నారు.
తాము ప్రయాణించే సమయంలో ఒక సిగ్నల్కు మరో సిగ్నల్కు మధ్య గ్యాప్ పెట్టుకుని, ఐదు నిమిషాలు ఆలస్యమైనా ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దన్నారు. దాడులు చేసి బాధితులు మీద కేసులు పెట్టే పరిస్థితి ఉండకూడదన్నారు.
పవన్ సమయస్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోలేనన్నారు. జైల్లో ఉన్నపుడు వచ్చి తనను పరామర్శించారని, బయటకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని అంతకు ముందు ప్రకటించినా, టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్టు జైలు బయట ప్రకటించారన్నారు. బీజేపీ,జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పి ఆ ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేశారన్నారు. ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశారన్నారు.
ఓటు బదిలీపై తమకు మొదట్లో అనుమానాలు ఉండేవని, కొవ్వూరులో మూడు పార్టీలు కలిసి ప్రచారం చేశామని, ఆరు జిల్లాల్లో ఇద్దరు కలిసి ప్రచారం చేశామని చెప్పారు. అనంతపురంలో అమిత్ షా ధర్మవరం ప్రచారానికి వచ్చారని చెప్పారు.
అందరి సహకారంతో బుధవారం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, ప్రధాని మోదీ, అమిత్ షా వస్తున్నారని, నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా, ఈసారి ఉన్న ప్రాధాన్యత వేరన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని అమిత్షా, మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. రాష్ట్రానికి సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు.
తాను రాగద్వేషాలకు అతీతంగా 45ఏళ్లు రాజ్యాంగబద్దంగా పనిచేశానని, ప్రజల కోసం కష్టపడటం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాడటమే తనకు తెలిసిన విషయాలన్నారు. ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదని అత్యున్నతమైన బాధ్యత అప్పగించారన్నారు.ని చెప్పారు.
రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది, దెబ్బతినని వర్గమంటూ లేకుండా పోయారన్నారు. కూలీ పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు, సొంత డబ్బులతో ఓటు వేయడానికి వచ్చారని చెప్పారు. విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు లక్షలు ఖర్చు పెట్టి వచ్చి ప్రచారం చేశారని చెప్పారు. బాధ్యతతో ఓటర్లు చేసిన కృషిని తెలుగు జాతి గుర్తు పెట్టుకుంటుందన్నారు.