AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో నాలుగు రోజులు భారీ వర్షాలు
AP Rains : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.... రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా ఏర్పాడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
AP Rains : ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఐఎండీ అంచనా ప్రకారం వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం కురిసినప్పుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రాబోయే నాలుగు రోజుల వాతావరణ వివరాలు ఇలా
- అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో బుధవారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు పల్నాడు, బాపట్ల జిల్లాల్లో గురువారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
- శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
- శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు , నంద్యాల జిల్లాల్లో శనివారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణకు రెడ్ అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అల్ప పీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో తెలంగాణలోని పశ్చిమ జిల్లాలు సహా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.