Extra Marital Affair : భర్తను చంపేసిన భార్య.. మిస్సింగ్ కంప్లైంట్.. హెల్ప్ చేసిన తండ్రి!
07 December 2022, 23:05 IST
- Nizamabad Crime News : ఓ భార్య కట్టుకున్న వాడినే.. చంపేసింది. ఆపై అదృశ్యం అయ్యాడంటూ.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ దారుణంలో ఆమె తండ్రి కూడా ఉండటం షాకింగ్.
ప్రతీకాత్మక చిత్రం
జీవితాంతం తోడు ఉండాల్సిన భార్య.. పక్కదారి పట్టింది. ఏడడుగులు నడిచిన ఆమె.. భర్తను కాటికి పంపింది. తాగి హింసిస్తున్నాడని, అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని తిరిగిరానిలోకాలకు పంపింది. భర్తను హత్య చేయడంలో ఆమె తండ్రి కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముగ్గురి సాయంతో.. భర్తను పూడ్చిపెట్టింది ఆ మహిళ. భర్త మిస్ అయ్యాడంటూ.. ఇచ్చిన కంప్లైంట్(Complaint) ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ తెలిపారు.
నిజామాబాద్(Nizamabad) జిల్లా వేల్పూర్ మండలం ఆంక్సాపూర్ గ్రామానికి చెందిన జమున, రంజిత్ కుమార్ భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్టోబర్ 24వ తేదీన తన భర్త కనిపించడం లేదంటూ.. భార్య జమున పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసు(Police)లు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేస్తుంటే అసలు విషయాలు బయటకు వచ్చాయి. గొల్ల నగేశ్ అనే వ్యక్తితో జమునకు అక్రమ సంబంధం ఉంది. మరోవైపు భర్త తాగొచ్చి అప్పుడప్పుడూ గొడవ చేస్తూ ఉండేవాడు. దీంతోపాటు అక్రమసంబంధానికి భర్త రంజిత్ ను అడ్డు వస్తున్నాడని.. చంపేయాలని ప్లాన్ వేసింది.
అయితే చంపేందుకు రంజిత్ ఓకే అన్నాడు. ఆమె తండ్రి(Father) బైండ్ల గంగారం, మరో వ్యక్తికి కూడా ఈ విషయం చెప్పింది. తన భర్త రంజిత్ వేధిస్తున్నాడని తెలిపింది. అప్పుడప్పుడు జరుగుతున్న గొడవలు చూసి వాళ్లు కూడా నిజమే అనుకున్నారు. ఇక హత్య చేసేందుకు జమున, ప్రియుడు నగేశ్, తండ్రి గంగారం, మరో వ్యక్తి రెడీ అయ్యారు.
మొత్తం నలుగురు కలిసి మద్యం మత్తులో ఉన్న రంజిత్ ను పొలంలో కర్రలతో కొట్టారు. తలపై దెబ్బలు తగలడంతో రంజిత్ చనిపోయాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మామిడి చెట్టు వద్ద గోయి తవ్వి పూడ్చేశారు. పూడ్చి పెట్టిన దగ్గర అనుమానం రాకుండా గడ్డి కూడా వేశారు. పోలీసు విచారణలో జమున ఈ విషయాన్ని ఒప్పుకున్నట్టుగా ఏసీపీ ప్రభాకర్ రావు వెల్లడించారు.
భార్య జమున మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె కాల్ డేటా(Call Data) చెక్ చేయగా.. ఎక్కువ సార్లు ఫోన్ కాల్స్ గొల్ల నగేశ్ కు వెళ్లాయి. దీంతో ఏదో ఉందని పోలీసులు అనుకున్నారు. జమున, గొల్ల నగేశ్ ను విచారించగా.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. భర్తను ప్రియుడు నగేశ్, తన తండ్రి గంగారం, మరో వ్యక్తితో కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. మృతదేహాన్ని పూడ్చిన స్థలానికి వెళ్లి.. పోస్టు మార్టం చేయించారు పోలీసులు.