Murder Plan : భర్త వేధింపులు…. సుపారీ హత్యకు భార్క స్కెచ్…దొరికారు ఇలా….
19 December 2022, 7:57 IST
- వేధింపుల భర్తను అడ్డు తొలగించుకోడానికి స్కెచ్ వేసిన భార్య, పక్కాగా ప్లాన్ అమలు చేసింది. నిద్రమాత్రలు ఇచ్చి బంధువుల సాయంతో అడ్డు తొలగించుకుంది. ఆపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, తరచూ స్టేషన్కు వెళ్లి విచారణ చేస్తుండటంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చి కాల్ డేటా పరిశీలించారు. దీంతో హత్య కుట్ర బయటపడింది.
వేధింపుల భర్త మర్డర్కు ప్లాన్ చేసిన భార్య
Murder Plan కట్టుకున్న భర్త అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా పరాయి స్త్రీలతో కలిసి ఉన్న దృశ్యాలను వీడియోలు తీసి చూపిస్తుండటంతో తట్టుకోలేకపోయిన భార్య భర్త హత్యకు కుట్ర పన్నింది. పక్కా స్కెచ్తో భర్తను సుపారీ ఇచ్చి కడతేర్చింది.
కాజీపేటలో జరిగిన సుపారీ హత్య కేసును పోలీసులు చేధించారు. మహబూబా బాద్కు చెందిన జన్నారపు వేణు కుమార్ చిట్ఫండ్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య సుస్మిత రైల్వే లోకోషెడ్లో టెక్నీషియన్గా ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాజీపేటలోని డీజిల్కాలనీలో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. వేణు కుమార్ మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన తర్వాత సుస్మిత సర్దుకుపోయింది.
ఫైనాన్స్ వ్యాపారం చేసే వేణుకుమార్ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టు కోవడంతో పాటు.. వారితో కలిసి ఉన్న వీడియోలు తీసి, వాటిని తరచూ సుస్మితకు చూపించి వేధించేవాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త వైఖరిలో ఎంతకూ మార్పు రాకపోవడంతో వేణుకుమార్ను చంపాలని సుస్మిత నిర్ణయించుకుంది. తన సమీప బంధువు కొంగర అనిల్కు విషయం చెప్పింది. భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని వాపోయింది.
దీంతో వేణుకుమార్ అడ్డు తొలగించడానికి అనిల్ అంగీకరించాడు. ఓ హత్య కేసులో నిందితుడైన జయశంకర్ జిల్లా మొగళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన గడ్డం రత్నాకర్ను అనిల్ సంప్రదించాడు. వేణుకుమార్ను హతమార్చడానికి రూ.4 లక్షల సుపారీ మాట్లాడాడు. ముందస్తుగా నిందితుడికి రూ.2లక్షలు చెల్లించాడు. పథకం ప్రకారం గత సెప్టెంబరు 30న సుస్మిత పాలలో నిద్రమాత్రలు కలిపి వేణుకుమార్కు ఇచ్చింది. అతను గాఢ నిద్రలోకి వెళ్లగానే గడ్డం రత్నాకర్ వచ్చి వేణుకుమార్ను కారు వెనుక సీట్లో పెట్టుకుని పెద్దపల్లి జిల్లా మంథని బయలుదేరాడు.
మంథని వెళ్ళే దారిలో పరకాల వద్ద కటిక నవీన్ను కారులో ఎక్కించుకున్నాడు. మంథని వెళ్లాక వేణుకుమార్ దుస్తులు తొలగించి మానేరు వాగులో పడేశారు. అక్టోబరు 3న మానేరులో మృతదేహం లభించడంతో మంథని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మృతదేహం అచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోయింది.
వేణు హత్య తర్వాత నిందితుడు రత్నాకర్ సూచన మేరకు సుస్మిత అక్టోబరు 7న కాజీపేట పోలీస్స్టేషన్లో తన అదృశ్యమయ్యాడని సుస్మిత ఫిర్యాదు చేసింది. కాజీపేట ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్రెడ్డి దర్యాప్తు మొదలుపెట్టారు. సుస్మిత తరచూ ఠాణాకు వచ్చి తన భర్త ఆచూకీ కోసం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆమె వ్యవహార శైలిపై అనుమానం వచ్చింది. దర్యాప్తులో భాగంగా సుస్మిత, ఆమె బంధువు కొంగర అనిల్ కాల్డేటాను పరిశీలించారు. వీరిద్దరు రౌడీషీటర్ గడ్డం రత్నాకర్తో మాట్లాడిన రికార్డులు లభ్యమయ్యాయి.
నిందితులను అదుపులోకి తీసుకున్న కాజీపేట పోలీసులు విచారించడంతో వేణుకుమార్ హత్య వ్యవహారం వెలుగు చూసింది. నిందితులు ఇచ్చిన సమాచారంతో మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నాలుగు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా శోధించిన కాజీపేట పోలీసుల్నివరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అభినందించారు.