Telangana Govt : కొత్త హైకోర్టు నిర్మాణం... 100 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ
05 January 2024, 16:23 IST
- Telangana High Court News: కొత్త హైకోర్టు నిర్మాణం కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టు
Telangana High Court News: కొత్త హైకోర్టు నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… కొత్త హైకోర్టు నిర్మాణం కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం జీవోను జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్ , బుద్వేల్ గ్రామాల పరిధిలో ఉన్న 100 ఎకరాలను భూమిని హైకోర్టు నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు సర్కార్ తెలిపింది. ఈ మేరకు జీవో నెంబర్ 55 ను విడుదల చేసింది.
ఇటీవలే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైకోర్టును రాజేంద్రనగర్కు తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో 100 ఎకరాల్లో కొత్త భవనం నిర్మించేందుకు ఏర్పా ట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో కొత్త భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో… సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే హైకోర్టు తరలింపు ప్రతిపాదన నిర్ణయాన్ని పలువురు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు తరలింపు విషయాన్ని అడ్వకేట్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్లో చర్చించకుండా.. ఏకపక్షంగా సీజే నిర్ణయం తీసుకోవటం సరికాదని వాదిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు… నగరం నడిబొడ్డున ఉందని, అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు. శివారు ప్రాంతానికి తరలిస్తే… చాలా మంది న్యాయవాదులకు ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు.
చర్యలు ప్రారంభం - ఏజీ ఎ.సుదర్శన్రెడ్డి
హైకోర్టు నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే చర్యలు ప్రారంభించారని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. గతంలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలోనే హైకోర్టు తరలించాలనే ప్రతిపాదన వచ్చిందని… కానీ అప్పట్లో సాధ్యం కాలేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న అవసరాల మేరకు కొత్త భవనం ఆవశ్యకతను గుర్తించినట్లు వివరించారు. త్వరలోనే భవన నిర్మాణ పనులు కూడా మొదలవుతాయని చెప్పారు.
మరోవైపు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నియమించిన గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు, సభ్యులను తొలగించింది. 33 జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, సభ్యులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.