Sabarimala Special trains: శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు..దక్షిణమధ్య రైల్వే ప్రకటన
13 December 2023, 11:28 IST
- Sabarimala Special trains: శబరిమలలో అయ్యప్పకు ఇరుముళ్లు సమర్పించుకోడానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 22 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు.
ప్రత్యేక రైళ్లు
Sabarimala Special trains: శబరిమలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి.తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్లలో బెర్తులు ఖాళీ లేకపోవడంతో చెన్నై మీదుగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు గమ్య స్థానానికి చేరుకుంటున్నారు. ప్రత్యేక రైళ్ల కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో డిసెంబర్, జనవరి నెలల్లో 22 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. డిసెంబరు, జనవరి మాసాల్లో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-కొల్లం, సికింద్రాబాద్-కొట్టాయం, కాకినాడ-కొట్టాయంల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. నాలుగు రైళ్లు డిసెంబరు 27-30 తేదీల మధ్య.. 18 రైళ్లు జనవరి 3-15 మధ్య రాకపోకలు సాగించనున్నాయి.
సికింద్రాబాద్-కొల్లాం (నంబర్ 07111/07112) ప్రత్యేక రైలు ఈ నెల 27, జనవరి 3, 10, 17 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లాంలో ఈ నెల 29, జనవరి 5, 12, 19 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
కాకినాడ టౌన్-కొట్టాయం ల మధ్య నడిచే (నంబర్ 0713/0714) ప్రత్యేక రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30, జనవరి 6, 13, 20 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు కొట్టాయంలో బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు జామున కాకినాడకు చేరుకుంటుంది.
సికింద్రాబాద్-కొట్టాయం మధ్య (నంబర్ 07117/07118) స్పెషల్ ట్రైన్ జనవరి 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో జనవరి 4వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటలకు కొట్టాయంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది.
సికింద్రాబాద్-కొట్టాయం ల మధ్య మరో (నంబర్ 07009/07010) స్పెషల్ ట్రైన్ జనవరి 6, 13 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.05 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8, 15 తేదీల్లో అర్ధరాత్రి 12.30 కొట్టాయంలో గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది.
ముంబై రైలు పొడిగింపు…
ముంబయి-సికింద్రాబాద్ల మధ్య నడిచే దేవగిరి ఎక్స్ప్రెస్ను లింగంపల్లి స్టేషన్ వరకు పొడిగించింది. ఈ మేరకు ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 14వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.
లింగంపల్లి-ముంబయి సీఎస్ఎంటీ (ఛత్రపతి శివాజీ టెర్మినల్) రైలు నెం.17058 లింగంపల్లిలో మధ్యాహ్నం 12.15 గంటలకు బయల్దేరుతుంది. బేగంపేట స్టేషన్కు మధ్యాహ్నం 1.03కు చేరుకుంటుంది. ఇక్కడ రెండు నిమిషాలు ఆగుతుంది. మధ్యాహ్నం 1.20కి సికింద్రాబాద్ స్టేషన్ చేరుకునే దేవగిరి ఎక్స్ప్రెస్ 1.25కి బయల్దేరి ముంబయికి ప్రయాణం అవుతుంది.
ఈ రైలు సికింద్రాబాద్-ముంబయి మధ్య ప్రయాణ సమయాల్లో ఎలాంటి మార్పులేదు. సికింద్రాబాద్లో బయల్దేరి ఈ రైలు బొల్లారం, కామారెడ్డి, బాసర మీదుగా ముంబయి వెళుతుంది. తిరుగుప్రయాణంలో ముంబయి సీఎస్ఎంటీ-లింగంపల్లి రైలు నెం.17057 సికింద్రాబాద్ స్టేషన్కు మధ్యాహ్నం 2.35కి చేరుకుంటుంది. సికింద్రాబాద్లో 2.40కి బయల్దేరి బేగంపేటకు 2.53కి చేరుతుంది. 2.55కి అక్కడ్నుంచి బయల్దేరి సాయంత్రం 3.40కి లింగంపల్లి స్టేషన్ చేరుకుంటుంది.