Revanth Reddy : కేసీఆర్ ఏటీఎంగా ధరణి పోర్టల్.. 35 లక్షల ఎకరాల భూమిని కొల్లగొట్టారన్న రేవంత్ రెడ్డి
25 August 2023, 14:16 IST
- Telangana Congress Latest News: ధరణి పోర్టల్ ను కేసీఆర్ ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు 'టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని మరోసారి పునరుద్ఘాటించారు.
రేవంత్ రెడ్డి
Revanth Reddy News: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ లోకి చేరారు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ఎన్.పీ. వెంకటేశంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి హస్తం కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.... ధరణి పోర్టల్ ను కేసీఆర్ ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. గతంలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు కేసీఆర్ కు ఏటీఎంగా ఉండేవని విమర్శించారు.
"ఎన్ని వందల కోట్లు వచ్చాయో, ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించుకున్నారో లెక్కలు చూసుకుంటున్నారు. ధరణిని రద్దు చేస్తే రైతు బీమా, రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ధరణి తెచ్చింది 2020లో... రైతుబంధు, రైతు బీమా మొదలు పెట్టింది.ధరణిని కేసీఆర్ తన దోపిడీకి వాడుకుంటున్నారు. ధరణి వచ్చాక 35లక్షల ఎకరాల దళిత, గిరిజన భూములను కొల్లగొట్టారు. కేసీఆర్ దళారీగా మారి వేల మంది వీఆర్వోల పని ఆయనే చేస్తున్నారు. కలెక్టర్లను అడ్డు పెట్టుకుని భూములు దోచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ధరణిని రద్దు చేస్తుంది. అంతకంటే అత్యాధునిక విధానాన్ని తీసుకువచ్చి భూములకు రక్షణ కల్పిస్తాం" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
టైటిల్ గ్యారంటీ ఇచ్చి భూములకు రక్షణ కల్పిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ధరణి ఉన్నంత కాలం దళిత, గిరిజనుల భూములకు రక్షణ లేదన్నారు. ధరణిపై 12వేల గ్రామంపంచాయితీల్లో గ్రామసభలు పెట్టేందుకు సిద్దమా...? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దోపిడీని ప్రశ్నిస్తే... మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డును ముందు పెడుతున్నారని... మరి నువ్వు అక్రమ కేసులు పెట్టిన వారు బీసీలు కాదా? అని నిలదీశారు. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య అగాధం ఉన్నట్లు కేసీఆర్ నమ్మించారని వ్యాఖ్యానించారు.
"ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ఇద్దరూ రాజ్ భవన్ లో తలుపులు మూసి మాట్లాడుకున్నారు. మీ మధ్య ఏం రహస్యం ఉంది? ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే అందరి ముందే మాట్లాడుకోవచ్చు కదా..? ఇన్నాళ్లు గవర్నర్ ను బీజేపీ అధ్యక్షురాలు అని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు గవర్నర్ దగ్గరకు వెళ్లి బీఆరెఎస్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. వీళ్లిద్దరి మధ్య ఎన్నికల పొత్తు అయినట్లా? కానట్లా? ప్రజలు ఆలోచించాలి. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ ఛోటా భాయ్ లాంటి వాడు" అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు,