Rashtrapati Nilayam Hyd: గుడ్ న్యూస్.. ఇక ఎప్పుడైనా రాష్ట్రపతి నిలయాన్ని చూడొచ్చు
23 March 2023, 14:11 IST
Rashtrapati Nilayam at Bolarum: సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలనుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇక నుంచి ఎప్పుడైనా రాష్ట్రపతి నిలయానికి వెళొచ్చు. డిసెంబర్ మినహా ఏడాది పొడవునా సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు బుధవారం ద్రౌపది ముర్ము .... రాష్ట్రపతి నిలయాన్ని వర్చువల్ మోడ్లో ప్రారంభించారు.
బొల్లారం రాష్ట్రపతి నిలయం
Rashtrapati Nilayam Hyderabad: రాష్ట్రపతి నిలయం.... సికింద్రాబాద్ లోని బొల్లారం ఉంటుంది. ఇప్పటివరకు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే సందర్శకులను అనుమతి ఉండేది. అయితే ఇక ఏడాది పొడవునా చూసే అవకాశం వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతించే కార్యక్రమాన్ని బుధవారం రాష్ట్రపతి ద్రౌపదిముర్ము వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఫలితంగా ఇక ప్రతిరోజూ రాష్ట్రపతి నిలయాన్ని చూసే అవకాశం దక్కనుంది.
చారిత్రక కట్టడాలు, పూల తోటలు, పండ్ల తోటలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది రాష్ట్రపతి నిలయం. గతంలో ప్రెసిడెంట్ శీతాకాల విడిది తర్వాత 15 రోజులు మాత్రమే సందర్శకుల కోసం తెరిచి ఉంచేవారు. ఇక నుంచి రాష్ట్రపతి విడిది చేసే డిసెంబర్ నెల మినహా అన్ని రోజుల్లోనూ సాధారణ ప్రజలను సందర్శనార్థం అనుమతించనున్నారు. ఇక వారానికి ఆరు రోజులు (సోమవారాలు , ప్రభుత్వ సెలవులు మినహా) ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చు.
టికెట్ ధరలు...
రాష్ట్రపతి భవన్ సందర్శించే భారతీయులకు ప్రతి వ్యక్తికి రూ. 50గా నిర్ణయించారు. అదే విదేశీయులైతే రూ. 250గా ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 160 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన రాష్ట్రపతి నిలయం హెరిటేజ్ భవనాలు, ఆర్ట్ గ్యాలరీ, అండర్ గ్రౌండ్ టన్నెల్, ఆవరణలు, గార్డెన్లు, జై హింద్ ర్యాంప్, హెరిటేజ్ ఫ్లాగ్ పోస్ట్ సైట్ వంటి వాటిని చూడొచ్చు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సందర్శించే అవకాశం ఉంటుంది. ప్రవేశం మాత్రం సాయంత్రం 4 గంటల వరకే ఇస్తారు. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారి కోసం పార్కింగ్ సౌకర్యం, వస్తువులు భద్రపరుచుకొనే గది, రెస్ట్రూమ్స్, ఆర్వో వాటర్, క్యాంపస్లో డిస్పెన్సర్లు, ఫస్ట్ ఎయిడ్ సెట్తోపాటు ఉచిత గైడ్వంటి సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లే దారిలో సికింద్రాబాద్కు 10 కిలోమీటర్ల దూరంలో బొల్లారంలో లోతుకుంట అనే ప్రాంతానికి దగ్గర్లో రాష్ట్రపతి నిలయం ఉంది. దీన్ని పురాతన, వారసత్వ కట్టడంగా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో, దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం కొలువుదీరి ఉంటుంది. రాష్ట్రపతి నిలయం ఢిల్లీతో పాటు, హైదరాబాద్లోని బొల్లారం, హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాలో రాష్ట్రపతి రిట్రీట్లు ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తరాదికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోని స్థానిక ప్రజా సమస్యలపై ఒక అవగాహన కోసమని దక్షిణాది రాష్ట్రాల వారి కోసం హైదరాబాద్లో అలాగే మరొకటి సిమ్లాలో ఏర్పాటు చేశారు.