President Murmu: హైదరాబాద్లో బస చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
18 December 2023, 9:25 IST
- President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.
రాష్ట్రపతి ముర్ము
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు.
సోమవారం సాయంత్రం 6:25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారం నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించనున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళ సై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు అధికారులు, మంత్రులు స్వాగతం పలుకనున్నారు. రాష్ట్రపతి ప్రయాణించే మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్కు సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్ నిర్వహించారు. సైబరాబాద్ సీపీ ఏకే మహంతి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాష్ట్రపతి బస చేసే సమయంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా, మేడ్చల్ జిల్లా కలెక్టర్, రాచకొండ కమిషనర్ తదితరులు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈనెల 20వ తేదీ న భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించను న్నారు.
అక్కడ చేనేత ప్రదర్శన తిలకిస్తారు. ఈనెల 23 వరకు శీతాకాల విడిది చేస్తారు. హైదరాబాద్లో ఉన్న సమయంలో రాష్ట్రపతి పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే అవకాశమున్నట్టు సమాచారం.ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు, పర్యటన సందర్భంగా ట్రాఫిక్ దారి మళ్లించే చర్యలను అధికారులు చేపట్టారు. ఈనెల 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ వెళ్తారు.