Dalit Bandhu Scheme: దళితబంధు వస్తే.. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కట్..!
17 December 2022, 19:28 IST
- Telangana SC Corporation: దళితబంధు స్కీమ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది తెలంగాణ సర్కార్. అయితే ఈ పథకం కింద ఎంపికైన వారికి.. మిగతా పథకాలు అందుతాయా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
దళిత బంధు పథకంపై కీలక ఆదేశాలు!
TS SC Corporation On Dalit Bandhu: దళితబంధు... హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో తెలంగాణ సర్కార్ తీసుకొచ్చన పథకం. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకానికి సంబంధించి... త్వరలోనే రెండో విడత అమలుకు కూడా ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. రెండో విడతలో భాగంగా 2022-2023ఆర్ధిక సంవత్సరానికి గాను మొత్తం లక్ష 17వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు అందజేయనుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్... కీలక నిర్ణయం తీసుకుంది. దళితబంధు కింద లబ్ధిపొందిన కుటుంబాలను ఎస్సీ కార్పొరేషన్ పరిధిలోని ఇతర పథకాల నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ వెబ్సైట్లో సాంకేతిక మార్పులు చేసే పనిలో పడింది.
నిజానికి ఎస్సీ కార్పొరేషన్ కింద రాయితీ రుణాలు, ఇతర ఆర్థిక పథకాల కింద ఒకసారి లబ్ధిపొందిన కుటుంబాలకు ఐదేళ్లపాటు తదుపరి ఎంపికలో అవకాశమివ్వరు. ఆ తర్వాత మాత్రమే వారు అర్హులు అవుతారు. ఇదే మాదిరిగా దళిత బంధు స్కీమ్ లో కూడా అమలు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. లబ్ధిదారుడి ఆధార్, రేషన్కార్డు సహాయంతో సాఫ్ట్వేర్ ద్వారా వడపోత ప్రక్రియ పూర్తిచేయనుంది. ఫలితంగా లబ్ధిదారుల వివరాలతో ఎవరిని ఎంపిక చేయాలి..? ఎవరు అర్హులు అవుతారనేది కూడా సులభం కానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.
ఒక్కో యూనిట్ కు పది లక్షలు
దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులైన ఒక్కో ఎస్సీ కుటుంబానికి రూ.10లక్షల విలువైన యూనిట్ను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేస్తోంది. మొదటు ఫైలట్ ప్రాజెక్ట్ గా హుుజురాబాద్ లో అమలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్నారు. వీటి ద్వారా ఉపాధి పొంది ఆర్థిక సాధికారత సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు 35వేలకు పైగా యూనిట్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రస్తుతం ఎమ్మెల్యేల సిఫారసు మేరకు జరుగుతోంది. త్వరలోనే రెండో విడత జరగనుంది. రెండో విడతలో భాగంగా 2022-2023ఆర్ధిక సంవత్సరానికి గాను మొత్తం లక్ష 17వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు అందజేయనుంది. నియోజకవర్గానికి 500మంది చొప్పన ఈ పథకానికి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈ పథకం కింద పవర్ ట్రిల్లర్, వరి కోత కోసే, వరి వేసే మెషిన్లు, ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు, కార్లు వంటి వాహనాలను కొనుక్కోవచ్చు. పాల డైరీ, కోళ్ల ఫారమ్, ఆయిల్ మిల్, గ్రైడింగ్ మిల్, స్టీల్, సిమెంట్, బ్రిక్ వ్యాపారాలు, ఫర్నీచర్ దుకాణాలు, క్లాత్ ఎంపోరియం, మొబైల్ దుకాణాలు, హోటళ్లు వంటి వ్యాపారం చేసుకోవచ్చు. ఆ డబ్బును మళ్లీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా సబ్సిడీ పొందుతారు.
ఆగిన ప్రక్రియ...
ఇటీవల దళిత బంధు ఎంపిక ప్రక్రియపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరి పిటిషన్ పై విచారించిన కోర్టు... లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసు అవసరం లేదనిస్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి నియోజకవర్గాలవారీగా లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల స్వీకరణపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై ఎస్సీ కార్పొరేషన్ సమాలోచనలు చేస్తోంది. అయితే ఎంపిక కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా ఉంది సర్కార్. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.