Mancherial Murders : వివాహేతర సంబంధంతో ఆరు ప్రాణాలు బలి….
18 December 2022, 7:04 IST
- Mancherial Murders : మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటన ప్రమాదశాత్తూ జరగలేదని పోలీసులు గుర్తించారు. ఆరుగురు సజీవ దహనమైన ఘటనకు షార్ట్ సర్క్యూట్, చలిమంట కారణం కాదని, పక్కా ప్రణాళికతో కుటుంబం మొత్తాన్ని హతమార్చారని ప్రాథమికంగా గుర్తించారు. వివాహేతర సంబంధం, కారుణ్య నియామకంలో ఉద్యోగం కోసమే హత్యలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు.
శివయ్య, మసా పద్మ దంపతులు
Mancherial Murders మందమర్రిలో ఆరుగురి ప్రాణాలను బలిగొన్న ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, పక్కా ప్రణాళికతో పెట్రోల్ పోసి ఇంట్లో ఉన్న వారందరిని తగులబెట్టేశారని గుర్తించారు. ఆరుగురి ప్రాణాలను బలిగొన్న ఘటనలో ముగ్గురు ఏ సంబంధం లేని వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. పెద్దమ్మను పరామర్శించడానికి వచ్చిన యువతితో పాటు ఆమె ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో జరిగిన ఘటన పక్కా ప్రణాళికతో చేసిన హత్యలుగా గుర్తించారు. ఈ ఘటనలోఅభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లితో సహా కాలి బూడిదగా మారిపోయారు. సింగరేణి ఉద్యోగి వివాహేతర సంబంధంతో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న గొడవలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో హత్యలు జరిగినట్లు భావిస్తున్నారు. సింగరేణి ఉద్యోగి భార్య, తన ప్రియుడి సాయంతో ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించారు.
మందమర్రి మండలం గుడిపెల్లి పంచాయితీ వెంకటాపూర్ గ్రామంలో మసా పద్మ, శివయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరి పెద్ద కుమార్తె నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు నస్పూర్లో, రెండో కుమార్తె హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. కుమార్తె అంత్యక్రియల కోసం దంపతులు మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి, అప్పట్నుంచి అక్కడి పెంకుటింట్లోనే ఉంటున్నారు.
సింగరేణిలో మజ్దూర్గా పనిచేస్తున్న శనిగారపు శాంతయ్య అలియాస్ సత్తయ్యకు మసా పద్మతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో అతను కూడా వెంకటపూర్ ఇంట్లోనే వారితో కలిసి ఉంటున్నాడు. పద్మ చెల్లెలి కుమార్తె కొండంపేటకు చెందిన నెమలికొండ మౌనిక, తన ఇద్దరు పిల్లలు ప్రశాంతి, హిమబిందుతో కలిసి నాలుగు రోజుల క్రితం పెద్దమ్మ పద్మ ఇంటికి వచ్చింది. వీరంతా కలిసి ఉన్న ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాకపోవడంతో పోలీసులకు, అగ్నిమాపక శకటానికి సమాచారం అందించారు. వారు వచ్చేసరికే ఇంట్లో ఉన్న ఆరుగురూ సజీవ దహనమయ్యారు.
వివాహేతర సంబంధంతో సమస్యలు.....
సింగరేణి ఉద్యోగి శనిగారపు శాంతయ్య స్వగ్రామం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఉట్కూర్ గ్రామం. శ్రీరాంపూర్ భూగర్భ గనిలో ఉద్యోగం చేస్తున్నాడు. శాంతయ్యకు భార్య సృజన, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరూ చదువులు పూర్తైనా, నిరుద్యోగులుగానే ఉన్నారు. వీరంతా గోదావరి ఖనిలో నివాసం ఉంటున్నారు. పదేళ్ల క్రితం శాంతయ్యకు, శ్రీరాంపూర్లో సింగరేణి అధికారుల ఇళ్ళలో పనిచేసే పద్మతో పరిచయమై, అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
శాంతయ్య కొన్నేళ్లుగా కుటుంబాన్ని వదిలేసి ఆమెతోనే ఉంటున్నారు. ఈ విషయంలో శాంతయ్యకు భార్య సృజనకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు కేసులు కూడా నమోదయ్యాయి. పోలీసులు వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో శాంతయ్య భార్య సృజన కొంతకాలంగా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఉద్యోగం కోసమే దారుణం…..
సింగరేణి ఉద్యోగులు పదవీ విరమణకు రెండేళ్ల మెడికల్ అన్ఫిట్గా ధ్రువీకరణ పొందితే వారి వారసులకు ఉద్యోగం వస్తుంది. ఈ నేపథ్యంలో మెడికల్ అన్ఫిట్గా మారాలంటూ శాంతయ్యపై భార్య, కుమారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయంలోనూ కుటుంబ సభ్యుల్లో మనస్పర్థలు వచ్చాయి. దీనికితోడు శాంతయ్య జీతభత్యాల తాలూకూ డబ్బంతా సహజీవనం చేస్తున్న మహిళకే ఇస్తుండటం, ఉత్కూర్లో స్థలాన్ని విక్రయించగా వచ్చిన రూ.25 లక్షలూ ఆమెకే ఇచ్చినట్టు అనుమానాలుండటంతో కుటుంబ సభ్యులు ఆయనపై కక్ష పెంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఆరు నెలల కిందట ఒకసారి, మూడు నెలల క్రితం మరోసారి శాంతయ్యపై హత్యాయత్నాలు జరిగాయి. ఒకసారి కిడ్నాప్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. తమ సమస్యలకు భర్తతో పాటు ఆయన సహజీవనం చేస్తున్న మహిళ కుటుంబాన్ని అంతమొందించాలని శాంతయ్య భార్య పథక రచన చేసిందిం. ఇందుకు ఆమె ప్రియుడితో కలిసి అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
పరామర్శకు వచ్చి ప్రాణాలు కోల్పోయింది......
మసా పద్మ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆమె చెల్లెలు కుమార్తె, కొండంపేటకు చెందిన మౌనిక, తన పెద్దమ్మను పరామర్శించేందుకు ఇద్దరు పిల్లలతో ఐదు రోజుల క్రితం గుడిపెల్లికి వచ్చింది. వారంతా సజీవ దహనం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటన జరిగిన ఇంటి వెనుకవైపున టైర్లు సగం కాలిన స్థితిలో ఉన్నాయి. వాటికి కొద్ది దూరంలోనే 20 లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు పెట్రోలు డబ్బాలు ఉన్నాయి.
నిందితులు ఇంటి తలుపు సందుల్లోంచి పెట్రోల్ పోసి నిప్పంటించారనే అనుమానిస్తున్నారు. 'మంటలు చుట్టు ముట్టినా ఇంట్లోంచి అరుపులు వినిపించలేదని స్థానికులు చెబుతున్నారు. మంటలు, పొగ వ్యాపించడంతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడమో లేకుంటే ఆరుగురూ మత్తులో ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.