President Murmu : హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ము- ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం
18 December 2023, 21:43 IST
- President Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్, సీఎం ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్, సీఎం స్వాగతం
President Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్ము బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు, రాజకీయ నేతలు ఘనస్వాగతం పలికారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ఐదు రోజుల పాటు బొల్లారంలో బస చేస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా బొల్లారం చేరుకున్నారు. ఐదు రోజుల పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్రపతి పర్యటించనున్నారు.
ఐదు రోజుల పాటు విడిది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి బస చేసే సమయంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నారు. బొల్లారం రాష్ట్రపతి నివాసం పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈనెల 20న భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటించనున్నారు.