Jaahnavi Kandula Case : జాహ్నవి కందుల కేసులో అధికారిపై నేరాభియోగాల్లేవ్- ఇదెక్కడి న్యాయమని కేటీఆర్ ఆగ్రహం
22 February 2024, 15:54 IST
- Jaahnavi Kandula Case : అమెరికాలో ఏపీకి చెందిన కందుల జాహ్నవి మృతి కేసులో ప్రమాదానికి కారణమైన పోలీస్ అధికారిపై నేరాభియోగాలు మోపడంలేదని అక్కడి అధికారులు తెలిపారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రి, యూఎస్ అంబాసిడర్ స్పందించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
జాహ్నవి కందుల
Jaahnavi Kandula Case : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన కందుల జాహ్నవి(Jaahnavi Kandula) మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడంలేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉద్యేశపూర్వక ప్రమాదంపై సరైన సాక్ష్యాలు లేవని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ ఆఫీస్ ప్రకటించింది. సీనియర్ అటార్నీలతో విచారణ జరిపిన తర్వాతే పోలీసు అధికారిపై నేరాభియోగాలు మోపడంలేదని తెలిపింది. ప్రమాదం సమయంలో జాహ్నవి మృతిని చులకన చేస్తూ మాట్లాడిన మరో పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేరని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ తెలిపారు. అయితే అడెరెర్ వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా ఉన్నాయన్నారు. ఇప్పటికే అడెరెర్ పై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. అతనిపై కఠిన చర్యల అంశం కోర్టు పరిశీలనలో ఉందని అక్కడి అధికారులు తెలిపారు.
జాహ్నవి మరణానికి విలువలేదని పోలీస్ హేళన
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి(Jaahnavi Kandula ) గత ఏడాది జనవరిలో సియాటెల్లో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందింది. ఈ కేసు విచారణపై స్థానిక పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకన చేస్తూ నవ్వుతూ మాట్లాడిన వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. జాహ్నవి ఓ సాధారణ వ్యక్తి, ఆమె మరణానికి విలువలేదు, 11 వేల డాలర్లకు ఒక చెక్ రాయండి అన్నట్లు ఆయన మాట్లాడాడు. పోలీసులు అధికారుల మాట్లాడిన ఈ సంభాషణ బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో పెద్ద దుమారం రేపింది. ఆ పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని భారతప్రభుత్వం కూడా డిమాండ్ చేసింది. దీంతో అడెరెర్ ను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అతనిపై తుది చర్యలకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉందని అధికారులు తెలిపారు.
అసలేం జరిగింది?
కందుల జాహ్నవి అమెరికాలోని సౌత్ లేక్ యూనివర్సిటీలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సీటల్ క్యాంపస్లో మాస్టర్స్ చదువుతున్నారు. గతేడాది జనవరిలో సియాటెల్లో ఆమె రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లో ఎగిరి రోడ్డుపై పడింది. తీవ్ర రక్తస్రావమై ఆమె మృతి చెందింది.
స్వతంత్ర దర్యాప్తునకు కేటీఆర్ డిమాండ్
జాహ్నవి కందుల మరణానికి కారణమైన పోలీసు అధికారిపై నేరాభియోగాలు మోపకపోవడంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) అసహనం వ్యక్తం చేశారు. ఈ చర్యలు అవమానకరం, పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఎక్స్ వేదికగా స్పందించారు. భారత్ లోని యూఎస్ ఎంబసీ అధికారులు అమెరికా ప్రభుత్వంతో సంప్రదించి యువతి కందుల జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు యూఎస్ అంబాసిడర్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ యూఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. జాహ్నవి మృతిపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతి జీవితం చిన్నాభిన్నం కావడం బాధాకరం అయితే, బాధితురాలికి న్యాయం జరగకుండా నిర్లక్ష్యం చేయడం మరింత విషాదకరమని కేటీఆర్ అన్నారు.