BJP On Telangana : గుజరాత్ ముగిసింది.. ఇక తెలంగాణపై బీజేపీ ఫోకస్
05 December 2022, 18:35 IST
- BJP Focus On Telangana : గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఇక బీజేపీ వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతోంది. తెలంగాణపై ఫోకస్ పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది.
చేతిలో బీజేపీ పతాకంతో పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా(ఫైల్ ఫొటో)
తెలంగాణ(Telangana)లో పాగా వేయాలని బీజేపీ.. ఎదురు చూస్తూ ఉంది. గుజరాత్ అసెంబ్లీ(Gujarat Assembly) ఎన్నికలు ముగింపునకు వచ్చాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణపై ఫోకస్ పెట్టాలనుకుంటోంది బీజేపీ. ఇందుకోసం.. కాషాయం పార్టీ రాష్ట్రంలోని అవకాశాలను బలోపేతం చేసేందుకు అగ్ర నాయకత్వం సేవలను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ ఐదో దశ ప్రజా సంగ్రామం యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసే సభకు బీజేపీ పెద్ద నేతలను తీసుకురావాలని అనుకుంటున్నారు. బహిరంగ సభలో ప్రసంగించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) డిసెంబర్ 16న తెలంగాణలో పర్యటిస్తారు. కుదిరితే కేంద్రమంత్రులను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం కరీంనగర్లో నడ్డా ప్రసంగిస్తారు.
మరోవైపు సీఎం కేసీఆర్(CM KCR) కుమార్తె కవిత పేరు దిల్లీ మద్యం పాలసీ స్కామ్ రిమాండ్ రిపోర్టులో వచ్చింది. అయితే ఈ అంశాన్ని బీజేపీ బలంగా వాడుకోవాలని చూస్తోంది. తెలంగాణ గడ్డ మీద నుంచి.. ఈ అంశపై బీజేపీ నేతలు(BJP Leaders) టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయనున్నారు. మరోవైపు వివిధ కేసుల్లో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై కేంద్ర ఏజెన్సీల వరుస సోదాలతో ఇప్పటికే టీఆర్ఎస్ ఉలిక్కిపడిందని, ఈ పరిస్థితిని రాజకీయంగా క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
గతంలో తన బహిరంగ సభల్లో ప్రసంగించిన సందర్భంగా కేసీఆర్(KCR) ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వమని జేపీ నడ్డా అభివర్ణించారు. ఇప్పుడు మళ్లీ అదే అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే అప్పటికంటే.. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ పై మాట్లాడేందుకు ఛాన్స్ ఎక్కువగా ఉంది. దీంతో బీజేపీ ఈ విషయంపై స్పీడ్ పెంచనుంది. తెలంగాణలో తాజాగా జరుగుతున్న పరిణామాలు.. బీజేపీకి మరింత అవకాశం ఇచ్చినట్టుగా ఉన్నాయి.
మునుగోడు అసెంబ్లీ(Munugode Assembly) స్థానానికి జరిగిన ఉపఎన్నికలో విజయం సాధించాలనే బీజేపీ లక్ష్యానికి టీఆర్ఎస్ అడ్డుపడింది. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న తర్వాత మునుగోడులో బీజేపీ హ్యాట్రిక్ సాధించాలని చూసింది. హోరాహోరీగా సాగిన ఉపఎన్నికను టీఆర్ఎస్ గెలుచుకుంది. అధికార పార్టీ నేతల తప్పిదాలు, వివిధ ఏజెన్సీలు విచారణ చేపట్టడంలాంటి వాటితో అసెంబ్లీ ఎన్నికల ముందు.. అధికార పార్టీపై దాడులకు పదును పెట్టేందుకు దోహదపడుతుందని కాషాయ నేతలు భావిస్తున్నారు.
టీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ(CBI), ఐటీ వంటి ఏజెన్సీల వరుస దాడులు బీజేపీ దాడికి పదును పెట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలోకి ఫిరాయించేందుకు భారీ మొత్తంలో డబ్బు ఎర చూపేందుకు ప్రయత్నించారని.., కౌంటర్గా టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
కేంద్ర సంస్థల దాడులు ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టించాయి. డిసెంబర్ 16న నడ్డా ప్రసంగించనున్న బహిరంగ సభ అగ్నికి మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది. బండి సంజయ్(Bandi Sanjay) ఐదో దశ పాదయాత్ర భైంసా పట్టణం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో తీవ్ర దుమారం లేచింది. పోలీసుల చర్యను సవాల్ చేస్తూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
ప్రసంగాల సమయంలో బండి సంజయ్ మిషన్ 2023 అన్నట్టుగానే కామెంట్స్ చేస్తున్నారు. సోమవారం బండి సంజయ్ యాత్ర ఎనిమిదో రోజుకు చేరింది. 'పేదల కోసం పనిచేసే, హిందూ ధర్మాన్ని, హిందూ సోదరులను రక్షించే' సైకోగా తనను తాను సంజయ్ అనుకున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ(Telangana)లో బుల్డోజర్లు తెస్తామని చెప్పారు.
మెుత్తానికి రాబోయే రోజుల్లో తెలంగాణలో మాత్రం.. రాజకీయ వేడి ఇంకా రాజుకుంటుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో దద్దరిల్లనుంది. బీజేపీ(BJP) పార్టీ వచ్చే రోజుల్లో దృష్టిపెట్టే అవకాశం ఉంది. ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన లీడర్లను తీసుకొస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని అనుకుంటోంది.