Gujarat Assembly polls: ‘గుజరాత్’ ప్రచారం సమాప్తం
03 December 2022, 17:45 IST
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ల హోరాహోరీ ప్రచారానికి తెరపడింది.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా
Gujarat Assembly polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. డిసెంబర్ 5, సోమవారం ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రచారంలోకి మూడు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లు తమ హేమాహేమీ నాయకులను ప్రచార బరిలోకి దింపాయి.
candidates in the fray: 833 మంది అభ్యర్థులు
గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం స్థానాల సంఖ్య 182. తొలి దశలో డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్ ల్లోని స్థానాల్లో ఆ రోజు ఎన్నికలు జరిగాయి. ఆ రోజు 63.31% పోలింగ్ నమోదైంది. చివరిదైన రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5 న జరుగుతుంది. ఈ దశలో 93 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. ఈ 93 స్థానాలకు గానూ మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్ ల్లోని 14 జిల్లాల్లో ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ప్రధానంగా వదోదర, అహ్మదాబాద్, గాంధీనగర్ తదితర నగరాలు కూడా ఉన్నాయి. ఈ 93 స్థానాల్లో మొత్తం 2. 54 కోట్ల మంది ఓటర్లున్నారు.
Gujarat Assembly polls: ప్రముఖులు ఎవరు?
ఈ రెండో దశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ముఖ్య నాయకుల్లో ఘాట్లోడియా స్థానం నుంచి సీఎం భూపేంద్ర పటేల్, విరంగం నుంచి పటీదార్ లీడర్ హార్ధిక్ పటేల్, గాంధీనగర్ సౌత్ నుంచి ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్ ఉన్నారు. వీరు బీజేపీ టికెట్ పై బరిలో ఉన్నారు. ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో డిసెంబర్ 1, 2 తేదీల్లో ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం జరిపారు. మోదీతో పాటు బీజేపీ తరఫున సీనియర్ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్.. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే.. ఆప్ తరఫున ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ ప్రచారం నిర్వహించారు.