Hyderabad Book Fair 2022: హైదరాబాద్లో పుస్తకాల జాతర.. టైమింగ్స్ ఇవే
21 December 2022, 14:48 IST
- Hyderabad Book Fair 2022: హైదరాబాద్ బుక్ ఫెయిర్ వచ్చేసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల జాతరకు సర్వం సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభమయ్యే ఈ బుక్ ఫెయిర్... జనవరి 1వ తేదీ వరకు ఉంటుంది.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ 20222
35th National Book Fair in Hyderabad: చినిగిన చొక్కా అయిన తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. అవును పుస్తకానికి అంత ప్రాధాన్యత ఉంది మరీ..! పుస్తకాలు చదవడం ద్వారా వచ్చే జ్ఞానం అంతా ఇంతా కాదు..! ధనవంతుడు నుంచి సామాన్యుడి వరకు పుస్తక పఠనమంటే అమితిమైన ఇష్టం ఉండే వారు ఉంటారు. కొందరైతే ఏకంగా టార్గెట్ పెట్టుకొని మరీ చదివేస్తారు. ఇలా పుస్తకాలంటే ఇష్టపడే వారి కోసం ప్రతి ఏడాది హైదరాబాద్ వేదికగా బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా అదేరీతిలో ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.
ప్రతీ సారిలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ లోనే ఈ బుక్ ఫెయిర్ జరగుతుంది. మద్యాహ్నం 2 గంటలల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుంది. ఈ ఏడాది 340 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు వస్తారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు.
మొదటి రోజు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డితో పాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ హాజరుకానున్నారు. వారి చేతుల మీదుగా బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. కాగా ఈసారి ముఖ్యమంత్రి పేరిట కూడా ఓ స్టాల్ ఏర్పాటు చేయబోతున్నారు. సీఎం కేసీఆర్ పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలనన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కేంద్ర హిందీ సంస్థాన్ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కావాల్సిన పుస్తకాలు లభించనున్నాయి. అలాగే ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రేపట్నుంచి జరగబోయే బుక్ ఫెయిర్ లో రచయితల పుస్తకాల ప్రదర్శన, అమ్మకాలను జరిపేందుకు అవకాశం కల్పిస్తున్నారు. బుక్ ఫెయిర్ నిబంధనలకు లోబడి ప్రతి రచయిత వారి రచనల్లోని ఐదింటిని, ఐదు కాపీలు చొప్పున ప్రదర్శనకు ఉంచాల్సి ఉంటుంది. ఒకటి నుంచి 10 టైటిల్స్ ఉన్న రచయితలకు ప్రత్యేకంగా ఒక టేబుల్ కేటాయిస్తామని నిర్వహకులు చెప్పారు. జనవరి 1, 2023న ఈ బుక్ ఫెయిర్ ముగుస్తుంది.