IPL Auction | కోహ్లికే మళ్లీ కెప్టెన్సీ ఇవ్వాలంటున్న మాజీ క్రికెటర్
08 February 2022, 9:41 IST
- IPL Auction.. ఐపీఎల్ మెగా వేలానికి టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ టీమ్స్ వ్యూహాలు, ఎంపికలు, కెప్టెన్సీలపై ఎవరి అంచనాలు వాళ్లు చెబుతున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ గురించి మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.
టీమిండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి
బెంగళూరు: మరో నాలుగు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం జరగబోతోంది. ఈ వేలంతో టీమ్స్ అన్నీ కొత్త లుక్లో కనిపించబోతున్నాయి. అయితే వీటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఆ టీమ్ విరాట్ కోహ్లి, మ్యాక్స్వెల్, సిరాజ్లను రిటేన్ చేసుకుంది. కానీ ఈ ముగ్గురిలో ఎవరికీ కెప్టెన్సీ అప్పగించలేదు.
గతేడాది తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు వేలంలో కొత్త కెప్టెన్ను వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే అలా చేయడం కంటే విరాట్ కోహ్లికే మళ్లీ కెప్టెన్సీ ఇస్తే ఆ ఫ్రాంచైజీ పని సులువవుతుందని మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ అంటున్నాడు. ఇదే వాళ్లకు సులువైన పరిష్కారమని చెప్పాడు.
కొత్త కెప్టెన్ కోసం చూస్తున్న ఆర్సీబీ వేలంలో శ్రేయస్ అయ్యర్ కోసం రూ.20 కోట్లు పక్కన పెట్టిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అగార్కర్ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కెప్టెన్సీకి కోహ్లి కూడా సుముఖంగా ఉంటే ఆ టీమ్ సమస్య పరిష్కారమైనట్లే అని అగార్కర్ అభిప్రాయపడ్డాడు.
ఇక గతంలో వేలంలో ఆ టీమ్ వ్యవహరించిన తీరుపై అగార్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ టీమ్ ఎప్పుడూ పైనున్న ముగ్గురిపైనే ఎక్కువగా ఆధారపడింది తప్ప.. ఓ బలమైన టీమ్ను నిర్మించుకునే ప్రయత్నం చేయలేదన్నాడు. ఒక్క ప్లేయర్కు భారీగా చెల్లించడం వల్ల మ్యాచ్లు గెలుస్తారేమోగానీ, టోర్నమెంట్లు కాదని అతడు స్పష్టం చేశాడు. ఈసారి వేలంలోనూ అలాంటి తప్పు చేయకూడదని సూచించాడు.