India vs England: షమీ అరుదైన ఘనత.. అగార్కర్, జహీర్ను అధిగమించిన బౌలర్
13 July 2022, 8:27 IST
- భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. తాజా ఘనతతో అగార్కర్, జహీర్ రికార్డులను అధిగమించాడు.
మహ్మద్ షమీ
ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ అదరగొట్టారు. బుమ్రా 6 వికెట్లతో విజృంభించగా.. 3 వికెట్లతో షమీ ఆకట్టుకున్నాడు. బుమ్రా 19 పరుగులకే 6 వికెట్లు తీయగా.. షమీ 31 పరుగులకే 3 వికెట్లతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్లో మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 150 వికెట్ల క్లబ్ చేరిపోయాడు. వేగంగా ఈ ఘనత సాధించిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్లో మొదట బుమ్రా నిప్పులు చెరిగాడు. అతడు టాపార్డర్ బ్యాటర్లందరినీ ఒకరి తర్వాత ఒకరిని పెవిలియన్ చేర్చాడు. జేసన్ రాయ్, జోయ్ రూట్లను డకౌట్ చేయగా.. అనంతరం జానీ బెయిర్స్టోను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత షమీ తన పని ప్రారంభించాడు. ప్రమదాకర బెన్ స్టోక్స్ వికెట్ తీసి ఇంగ్లాండ్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఆ కాసేపటికే మళ్లీ బుమ్రా లియామ్ లివింగ్ స్టోన్ వికెట్ తీగా.. ప్రసిధ్ కృష్ణ.. మొయిన్ అలీని వెనక్కి పంపాడు. తిరిగి వచ్చిన షమీ తన సెకండ్ స్పెల్లో ఇంగ్లీష్ కెప్టెన్ జాస్ బట్లర్ను ఔట్ చేశాడు. ఈ వికెట్తో షమీ 150వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
150 వికెట్ల మైలురాయిని షమీ కేవలం 80 మ్యాచ్ల్లోనే అందుకున్నాడు. దీంతో భారత మాజీ ఆటగాళ్లు అజిత్ ఆగార్కర్(97 మ్యాచ్లు), జహీర్ ఖాన్(103 మ్యాచ్లు) రికార్డులను అధిగమించాడు. భారత క్రికెట్లో అత్యంత వేగంగా 150 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా చూసుకుంటే అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన మూడో బౌలర్గా షమీ నిలిచాడు. రషీద్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు 77 మ్యాచ్ల్లో 150 వికెట్లు తీశాడు. రషీద్ తర్వాత పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ సక్లేయిన్ ముస్తాక్ 78 మ్యాచ్ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
మరోపక్క బుమ్రా ఈ మ్యాచ్లో కెరీర్ బెస్ట్ (6/19) గణాంకాలు నమోదు చేశాడు. షమీ (3/31)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లాండ్ 110 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్, ధావన్ నిలకడగా ఆడి వికెట్ కోల్పోకుండా 111 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా రోహిత్ మాత్రం లక్ష్యం చిన్నదైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మరోపక్క ధావన్ 58 బంతుల్లో 31 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడాడు.