Lakshya sen | ఆల్ ఇంగ్లాండ్ క్వార్టర్స్లో లక్ష్య సేన్.. వరుస సెట్లలో విజయం
17 March 2022, 20:52 IST
- ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ 2022లో భారత షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. ప్రపంచ నెంబర్ 3 డెన్మార్క్ కు చెందిన ఆండెర్స్ ఆంటోన్సెన్పై వరుస సెటలో విజయం సాధించాడు ఈ 20 ఏళ్ల షట్లర్.
లక్ష్య సేన్
ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ 2022లో భారత షట్లర్ లక్ష్యసేన్ అదరగొడుతున్నాడు. వరుస విజయాలతో టోర్నీలో దూసుకెళ్తున్నాడు. తాజాగా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ 3 ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ను మట్టికరిపించాడు. వరుస సెట్లలో ఈ డెన్మార్క్ ఆటగాడిని ఓడించి క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
బర్మింగ్హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మూడో సీడ్ ఆండెర్స్ ఆంటోన్సెన్పై 21-17, 21-18 తేడాతో వరుస సెట్లలో లక్ష్య సేన్ విజయం సాధించాడు. కేవలం 55 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించాడు. మొదటి రౌండులో సింగపూర్ షట్రల్ లోహ్ కీన్ యూను ఓడించిన మరుసటి రోజే ప్రపంచ నెంబర్ 3 ర్యాంకర్ను మట్టికరిపించడా లక్ష్య సేన్.
ఆంటెన్సెన్ నుంచి పోటీ పెద్దగా ఎదురుకాకపోవడంతో లక్ష్య సేన్ చాలా ఫ్రీగా ఆడాడు. డిఫెన్స్లోనూ పెద్దగా ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా కోర్టంతా కలయ తిరుగుతూ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి సెట్లో విజయం సాధించిన తర్వాత వేళ్లకు రక్తస్రావం కావడంతో టేపు ధరించాల్సి వచ్చింది. అయినప్పటికీ లక్ష్యంపైనే దృష్టి పెట్టి ప్రత్యర్థిపై పై చేయి సాధించాడు. 11-7తేడాతో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆంటోన్సెన్ 7 స్ట్రెయిట్ పాయింట్లు సాధించాడు. అయినప్పటికీ లక్ష్య సేన్ వెనక్కి తగ్గకుండా వరుసపెట్టి స్మాష్లు సంధించి పని పూర్తి చేశాడు.
ప్రస్తుతం పురుషుల సింగిల్స్ విభాగంలో కెరీర్ అత్యుత్తమం 11వ స్థానంలో ఉన్న లక్ష్య సేన్ తన తర్వాత మ్యాచ్ను కా లాంగ్-గువాంగ్ జు మధ్య జరిగే మ్యాచ్లో నెగ్గిన వారితో ఆడతాడు.