Mitchell Marsh About Ind vs Pak Match: భారత్-పాక్ మ్యాచ్ చూసిన తర్వాత వరల్డ్ కప్ ఆపేయొచ్చు.. మార్ష్ వ్యాఖ్యలు
25 October 2022, 13:12 IST
- Mitchell Marsh About Ind vs Pak Match: మిచెల్ మార్ష్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ చూసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ ఇంక ఆపేయొచ్చని స్పష్టం చేశాడు.
మిచెల్ మార్ష్
Mitchell Marsh About Ind vs Pak Match: ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూసిన ప్రతిఒక్కరికి నరాలు తెగే ఉత్కంఠ భావన కలిగి ఉంటుంది. ముఖ్యంగా భారత అభిమానులు సీట్ ఎడ్జ్లో కూర్చొని మ్యాచ్ ఆద్యంతం ఆస్వాదించారు. ఈ టోర్నీలో ఇంతకంటే ఏం కావాలి. ఇక చాలు అనేంతగా సగటు అభిమానికి ఆనందం కలిగించే దాయాదుల పోరు కొనసాగింది. పొట్టి కప్పులో రావాల్సినంత జోష్ ఈ ఒక్క మ్యాచ్లో వచ్చిందని అనిపించింది. అయితే ఈ భావన భారత అభిమానులకు వచ్చిందంటే అందులో పెద్ద ఆశ్చర్యమేమి లేదు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ క్రికెటర్కు ఇలాంటి భావన కలిగింది. అతడెవరో కాదు మిచెల్ మార్ష్. ఇలాంటి అద్భుతమైన మ్యాచ్ను చూశాక ప్రపంచకప్ టోర్నీని ఆపేయొచ్చని సరదా వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ సందర్భంగా మాట్లాడిన మార్ష్.. దాయాదుల పోరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఇంక వరల్డ్ కప్ ఆపేస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను. ఇంతకంటే మంచి మ్యాచ్ వీక్షంచకగలమా? టీ20 వరల్డ్ కప్నకు ఇంకా మూడు వారాల సమయముంది. ఆలోపే క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజా వచ్చేసింది. ఇంతకంటే అత్యుత్తమమైన మ్యాచ్ ఏముంటుంది. అందుకే టీ20 ప్రపంచకప్ను ఆపేయొచ్చేనేది నా అభిప్రాయం. భారత్-పాక్ మ్యాచ్ వీక్షించేందుకు భారీ సఖ్యలో వచ్చిన అభిమానుల్లో నేను కూడా ఉండి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నా. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా ఆడిన కోహ్లీని ఎంత ప్రశంసించినా తక్కువే. గత 12 నెలల్లో అతడి కెరీర్ను చూస్తే అద్భుతమేనని చెప్పాలి. నమ్మశక్యం కానీ రీతిలో అద్భుతంగా ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి ఇన్నింగ్స్లు మరిన్ని ఆడాలి" అని తెలిపాడు.
డిఫెండింగ్ ఛాంపియన్గా అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఈ సారి తొలి మ్యాచ్లోనే పరాజయాన్ని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉండాలంటే.. ఇక మిగతా మ్యాచ్ల్లో తప్పకుండా గెలవాల్సిందే.
ఆదివారం నాడు పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో తొలుత బౌలింగ్లో అదరగొట్టిన టీమిండియా.. దాయాది జట్టును 159 పరుగుల మోస్తరు స్కోరుకే పరిమితం చేసింది. అయితే లక్ష్య ఛేదనంలో ఆరంభంలోనే తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్ బ్యాటర్ల వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఇలాంటి సమయలో వచ్చిన విరాట్ కోహ్లీ నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే అనంతరం పుంజుకుని పాండ్యాతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో భారత్ చివరి బంతి వరకు పోరాడి 160 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.