Asia Cup 2022: జట్టులో సమతూకమైన ఆటగాడు హార్దిక్ ఒక్కడే.. మాజీ ప్లేయర్ ప్రశంస
12 August 2022, 19:42 IST
- టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య టీమిండియాలో సమతూకమైన ఆటగాడని మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. అతడు లేకుంటే జట్టు వ్యూహాలన్నీ విఫలమవుతాయని స్పష్టం చేశాడు.
హార్దిక్ పాండ్య
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గత కొంతకాలంగా స్థిరంగా ప్రదర్శన చేస్తూ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించి ఆ జట్టుకు అరంగేట్ర సీజన్లోనే టైటిల్ విజేతగా నిలిపాడు. అనంతరం సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. స్థిరంగా ఆడుతూ టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీంతో అతడిపై పలువురు మాజీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కూడా చేరిపోయాడు. జట్టును బ్యాలెన్స్ చేస్తున్న ఏకైక ఆటగాడు హార్దిక్ పాండ్యానే అని స్పష్టం చేశాడు.
"హార్దిక్ పాండ్య నాలుగు ఓవర్లు వేయడమనేది టీమిండియాకు ఇన్సురెన్స్ పాలసీ లాంటిది. అతడు చాలా మెరుగ్గా ప్రదర్శన చేస్తున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మైండ్లో ఒక్క విషయం పెట్టుకోవాలి. జట్టులో సమతూకం ఉన్న ఏకైక ఆటగాడు హార్దిక్ పాండ్య ఒక్కడే అని గుర్తుంచుకోవాలి. అతడు లేకుంటే జట్టు వ్యూహాలన్నీ విఫలమవుతాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాళ్లను కూడా భర్తీ చేయవచ్చు. కానీ హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. అతడు లేకుండా 11 మంది సభ్యులున్న బృందం సంపూర్ణం కాదు." అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.
ఆసియా కప్లో హార్దిక్ పాండ్యాను తెలివిగా ఉపయోగించుకోవాలని ఆకాశ్ చోప్రా చెప్పాడు. "ఆసియా కప్లో పాకిస్థాన్తో మ్యాచ్లో అతడు నాలుగు ఓవర్లు కచ్చితంగా వేయగలడు. ఆప్ఘనిస్థాన్, శ్రీలంక లాంటి జట్లతో కంటే కూడా పాక్తో మ్యాచ్లో అతడిని తెలివిగా ఉపయోగించుకోవాలి." అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో హార్దిక్ పాండ్య గుజరాత్ టైటాన్స్ తరఫున అదిరిపోయే ప్రదర్శన చేశాడు. కెప్టెన్గానూ ప్రత్యేకతను చాటుకున్నాడు. అనంతరం సౌతాఫ్రికా, ఐర్లాండ్తో సిరీస్ల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఐర్లాండ్తో సిరీస్కు తొలిసారిగా టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు.