Putrada ekadashi: నేడే పుత్రద ఏకాదశి.. పూజా విధానం, వ్రత ప్రాముఖ్యత ఏంటి?
21 January 2024, 5:00 IST
- Putrada ekadashi: సంతానం కోసం ఆరాటపడుతున్న వాళ్ళు పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. హిందూ శాస్త్రంలో పుత్రద ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
పుత్రద ఏకాదశి ప్రాముఖ్యత
Putrada ekadashi: హిందూ ఆచారాలలో ఏకాదశులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏకాదశి శ్రీ మహా విష్ణువుకి అంకితం చేయబడిన రోజు. జనవరి 21 పుత్రద ఏకాదశి వచ్చింది. పుష్య మాసంలో వచ్చింది కాబట్టి దీన్ని పుష్య పుత్రద ఏకాదశి అని అంటారు. ఈరోజు భక్తిభావంతో ఉపవాసం పాటించి విష్ణువుని పూజించడం వల్ల సుఖ సంతోషాలు కలగుతాయని భక్తుల నమ్ముతారు.
లేటెస్ట్ ఫోటోలు
కొత్తగా పెళ్ళైన దంపతులు ఎక్కువగా ఈ పుత్రద ఏకాదశి వ్రతం చేపడతారు. ఈ రోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల పుత్రుడు కలుగుతాడని నమ్ముతారు. ఈ సంవత్సరం జనవరి 21న ఆదివారం రోజున పుత్రద ఏకాదశి వచ్చింది.
ఏకాదశి తిథి ముహూర్తం
జనవరి 20, 2024 తిథి సాయంత్రం 7.27 గంటలకి ప్రారంభమై
జనవరి 21, 2024 సాయంత్రం 7.27 గంటలకి ముగుస్తుంది.
పరానా సమయం జనవరి 22, ఉదయం 7.13 గంటల నుంచి 9.23 గంటల వరకు ఉంది.
పుత్రద ఏకాదశి పూజా విధానం
వేకువజామునే నిద్రలేచి స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఈరోజు భక్తితో ఉపవాసం ఆచరించాలి. శ్రీ యంత్రంతో పాటు విష్ణువు విగ్రహాన్ని పూజా మందిరంలో పీట మీద ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దాని మీద పెట్టాలలి. నెయ్యితో దీపం వెలిగించి, పూలు, స్వీట్లు దేవుడికి సమర్పించాలి. తులసి పత్రంతో పాటు పంచామృతాన్ని విష్ణుమూర్తికి సమర్పించాలి. ఈ పూజలో తప్పనిసరిగా తులసి పత్రం ఉండాలి. లేదంటే పూజ అసంపూర్ణంగా భావిస్తారు. సూర్యాస్తమయానికి ముందే పూజ చేసి విష్ణువుకి భోగం సమర్పించాలి. విష్ణు సహస్రనామ పారాయణం, హరి స్తోత్రం పఠించాలి. విష్ణుమూర్తి దీవెనల కోసం తప్పకుండా ఆలయానికి వెళ్ళి పూజలు చేయాలి. ఉపవాసం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పుత్రద ఏకాదశి కథ విన్నా తర్వాత ఉపవాసం విరమించుకోవాలి.
పుత్రద ఏకాదశి రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ రోజు ఎట్టి పరిస్థితిలోనూ తులసి ఆకులు తుంచకూడదు. అది అశుభంగా పరిగణిస్తారు. మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాన్ని ముందు రోజు నుంచే తీసుకోవడం మానేయాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకూడదు. వీలైనంత వరకు మనసు దేవుడి మీద లగ్నం చేసి భగవంతుని నామ స్మరణ చేస్తూ ఉండాలి.
పుత్రద ఏకాదశి కథ
హిందూ పురాణాల ప్రకారం పూర్వం భద్రావతి రాజ్యాన్ని సుకేతుమన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి శైవం భార్య. తమకి పిల్లలు లేరని చనిపోయిన తర్వాత శ్రార్థ ఖర్మలు చేసేందుకు కూడా కొడుకు లేడని ఆలోచిస్తూ కుంగిపోయారు. ఈ మనోవేదనతో రాజు రాజ్యం వదిలి అడివి బాట పట్టాడు. అడవిలో ఉన్న రుషులు కొందరు రాజు బాధకి గల కారణం అడిగి తెలుసుకున్నారు. సంతానం లేదని చెప్పడంతో రుషులు పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించమని సూచిస్తారు. వారి సూచనల మేరకు సుకేతు రాజు తన భార్యతో కలిసి పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఫలితంగా వారికి విష్ణుమూర్తి ఆశీస్సులతో పుత్రుడు జన్మిస్తాడు.