Paultry | పౌల్ట్రీ పెడుతున్నారా.. రూ. 25 లక్షల సబ్సిడీ ఇదిగో
03 January 2022, 20:06 IST
- Poultry.. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న ఎంట్రప్రెన్యూర్షిప్ ఫర్ బ్రీడ్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ పౌల్ట్రీ స్కీమ్ ద్వారా రూ. 25 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది.
పౌల్ట్రీ బ్రీడింగ్ (image credit: Unsplash)
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న ఎంట్రప్రెన్యూర్షిప్ ఫర్ బ్రీడ్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ పౌల్ట్రీ స్కీమ్ పథకం ప్రయోజనాలేంటి? ఎవరు అమలు చేస్తారు? దరఖాస్తులు ఎలా చేయాలి? వంటి విషయాలు ఇవిగో..
గొర్రెలు, మేకలు తదితర పశు సంపద, పౌల్ట్రీ, పందుల పెంపకం, దాణా రంగాల్లో ఎంట్రప్రెన్యూర్షిప్ అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడం నేషనల్ లైవ్స్టాక్ మిషన్ లక్ష్యం.
అలాగే బ్రీడ్ అభివద్ధి చేయడం ద్వారా ప్రతి జంతు ఉత్పాదకత పెరుగుదలకు పాటుపడడం మరో లక్ష్యం. మాంసం, గుడ్డు, మేక పాలు, ఉన్ని, మేత ఉత్పత్తి పెరుగుదల ఎన్ఎల్ఎం లక్ష్యాల్లో మరొకటి.
పశువులు, పౌల్ట్రీ బ్రీడ్ అభివృద్ధిపై ఉప మిషన్
కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల బ్రీడ్ ఇంప్రూవ్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ లక్ష్యంగా కేంద్రం ఈ సబ్ మిషన్ను అమలు చేస్తోంది.
ఇందులో పలు రకాల స్కీమ్లు ఉన్నాయి. దీనిలో భాగమే ఎంట్రప్రెన్యూర్షిప్ ఫర్ బ్రీడ్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ పౌల్ట్రీ స్కీమ్.
వ్యక్తులు, రైతు సంఘాలు, స్వయం సహాయ సంఘాలు, సెక్షన్ 8 కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పథకం ద్వారా కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తుంది.
రాష్ట్ర పశుసంవర్థక శాఖ ద్వారా ఏర్పాటైన సంస్థ ఈ పథకం అమలు సంస్థగా ఉంటుంది. ఆ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వ్యక్తులు, సంస్థలు, ఎంట్రప్రెన్యూర్స్ నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతుంది.
ఆయా దరఖాస్తులను పరిశీలించి షెడ్యూల్డ్ బ్యాంకులు, లేదా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) వంటి ఆర్థిక సంస్థల ద్వారా ఆర్థిక, రుణసాయం పొందేందుకు స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సిఫారసు చే స్తుంది.
ప్రాజెక్ట్ ఫండింగ్ కోసం సదరు ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ లేదా బ్యాంక్ నుంచి హామీ లభిస్తే ఆయా దరఖాస్తులను స్టేట్ లెవల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అప్రూవల్ కోసం పంపుతారు. అక్కడ ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు.
ఎవరు అర్హులు?
సంబంధిత రంగంలో శిక్షణ పొంది ఉండాలి. లేదా తగిన అనుభవం ఉండాలి. అలాగే బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ నుంచి లోన్ మంజూరై ఉండాలి. లేదా బ్యాంకు గ్యారంటీ లభించి ఉండాలి.
సదరు వ్యక్తులు లేదా సంస్థలకు సొంతంగా లేదా లీజు ప్రాతిపదికన స్థలం తీసుకుని ఉండాలి. కేవైసీ సంబంధిత డాక్యుమెంట్లు ఉండాలి.
ప్రయోజనాలు ఏంటి?
ఎంట్రప్రెన్యూర్షిప్ ఫర్ బ్రీడ్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ పౌల్ట్రీ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 50 శాతం క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంది. పేరెంట్ ఫార్మ్, రూరల్ హాచరీ, మదర్ యూనిట్ను కనీసం 1000 పేరెంట్ లేయర్స్తో స్థాపించాలి.
50 శాతం సబ్సిడీ అంటే గరిష్టంగా యూనిట్కు రూ. 25 లక్షలు లభిస్తుంది. రెండు సమాన ఇన్స్టాల్మెంట్స్లో లభిస్తుంది. మొదటి వాయిదా నేరుగా షెడ్యూల్డ్ బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్కు సిడ్బీ నుంచి అందుతుంది. అక్కడి నుంచి ఎంట్రప్రెన్యూర్ ఖాతాలో జమవుతుంది.
రెండో వాయిదా ప్రాజెక్టు ఏర్పాటయ్యాక, దాన్ని స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ధ్రువీకరించాక సిడ్బీ ద్వారా లభిస్తుంది.
మిగిలిన 50 శాతం మొత్తాన్ని బ్యాంకులు లేదా ఇతర పైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ద్వారా రుణంగా తీసుకోవాలి లేదా సొంతంగా పెట్టుబడి పెట్టాలి.