PM-SYM | ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్-ధన్ పెన్షన్ యోజన గురించి తెలుసా?
03 January 2022, 19:55 IST
- Pradhan Mantri Shram Yogi Maan-Dhan (PM-SYM) Pension Yojana: కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సాంఘిక భద్రత సంక్షేమ పథకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ - ధన్ (పీఎం-ఎస్వైఎం) పథకం స్వచ్ఛంద కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం.
ప్రతీకాత్మక చిత్రం: వీధి వ్యాపారులకు PM-SYM (pc: Unsplash)
జీవిత బీమా సంస్థ, సీఎస్సీ ఈ గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ సహకారంతో కేంద్ర కార్మిక శాఖ ఈ పథకం అమలు చేస్తోంది. ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తూ పెన్షన్ అందించే బాధ్యత తీసుకుంటుంది.
ఈ పథకంలో లబ్ధిదారుని ప్రవేశ వయస్సును బట్టి దీనిలో నెలవారీ కంట్రిబ్యూషన్ రూ. 55 నుంచి రూ. 200 వరకు ఉంటుంది.
50% నెలవారీ కంట్రిబ్యూషన్ లబ్ధిదారుడి ద్వారా చెల్లిస్తే, సమాన మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ - ధన్ (పీఎం-ఎస్వైఎం) పథకం అర్హతలేంటి?
1. భారతీయ పౌరుడై ఉండాలి.
2. అసంఘటిత కార్మికులు (ఉదాహరణకు: వీధి వ్యాపారులుగా, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ స్థల కార్మికులు, తోలు, చేనేత, మధ్యాహ్న భోజన కార్మికులు, రిక్షా పుల్లర్లు లేదా ఆటో డ్రైవర్లు, రాగ్ పికర్లు, వడ్రంగులు, మత్స్యకారులు).
3. 18-40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
4. నెలవారీ ఆదాయం రూ. 15,000 కంటే తక్కువగా ఉండాలి.
5. ఈపీఎఫ్వో / ఈఎస్ఐసి / ఎన్పీఎస్ (ప్రభుత్వ చందా) సభ్యుడు కారాదు
ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ - ధన్ (పీఎం-ఎస్వైఎం) పథకం ప్రయోజనాలు ఏంటి?
1. 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత, లబ్ధిదారులు కనీస నెలవారీ పెన్షన్ రూ. 3,000లు పొందడానికి అర్హులు అవుతారు.
2. లబ్ధిదారుని మరణం తరువాత, జీవిత భాగస్వామి 50% నెలవారీ పెన్షన్ కు అర్హులు.
3. భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకంలో చేరితే, వారు ఉమ్మడిగా రూ. 6,000 నెలవారీ పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
చందాదారుడు మొబైల్ ఫోన్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ కలిగి ఉండాలి. అర్హులైన చందాదారులు సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్లను (సీఎస్సీ ఈగవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సీఎస్సీఎస్పీవీ)) సందర్శించవచ్చు.
ఆధార్ నెంబరు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, స్వీయ సర్టిఫికేషన్ ప్రాతిపదికన జన్-ధన్ ఖాతా నెంబరు ఉపయోగించి పిఎమ్-ఎస్వైఎం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పిఎమ్-ఎస్వైఎమ్ వెబ్ పోర్టల్ మాన్ధన్లో గానీ, మొబైల్ యాప్ ద్వారా గానీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అన్ని కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా ఎన్ రోల్ మెంట్ చేసుకోవచ్చు. మొదటి నెల కంట్రిబ్యూషన్ మొత్తాన్ని క్యాష్ రూపంలో చెల్లించాలి.
ఫెసిలిటేషన్ సెంటర్లు
ఎల్ఐసి బ్రాంచీ ఆఫీసులు, ఈఎస్ఐసీ / ఈపీఎఫ్వో కార్యాలయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని లేబర్ ఆఫీసుల్లో ఈ పథకం, దాని ప్రయోజనాలు అనుసరించాల్సిన ప్రక్రియ గురించి అసంఘటిత కార్మికులకు వివరిస్తారు.