Bengal panchayat polls : పంచాయతీ ఎన్నికల వేళ రణరంగంగా పశ్చిమ్ బెంగాల్.. ఏం జరుగుతోంది?
08 July 2023, 9:26 IST
Bengal panchayat polls live updates : పశ్చిమ్ బెంగాల్లో శనివారం ఉదయం పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. అయితే పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ.. హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా పశ్చిమ్ బెంగాల్ రణరంగంగా మారింది.
పంచాయతీ ఎన్నికల వేళ రణరంగంగా పశ్చిమ్ బెంగాల్..
Bengal panchayat polls live updates : తీవ్ర ఉద్రిక్తత, పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల మధ్య పశ్చిమ్ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు శనివారం కొనసాగుతున్నాయి. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతలకు కారణం ‘మీరంటే.. మీరే’ అంటూ అన్ని పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఘర్షణలు.. ఉద్రిక్తత..
పంచాయతీ ఎన్నికల తేదీని జూన్ 8న ప్రకటించారు. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 15మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన నలుగురు కార్యకర్తలు శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యారు! మరోవైపు కాంగ్రెస్, సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడి జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
ముర్షిదాబాద్ జిల్లాలో హింసాత్మక ఘటనలు అధికంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతంలో నివాసముండే బాబర్ అలీ అనే టీఎంసీ కార్యకర్త శుక్రవారం హత్యకు గురయ్యాడు. క్రూడ్ బాంబ్ దాడిలో ఓ టీఎంసీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. మరో టీఎంసీ కార్యకర్తను.. ఖర్గామ్ ప్రాంతంలో కత్తితో పొడిచి చంపేశారు.
West Bengal panchayat elections today : ఓ బీజేపీ కార్యకర్త తనపై శుక్రవారం దాడి చేసినట్టు తూర్పు మేదినీపూర్ సోన్చౌర గ్రామ పంచాయతీకి చెందిన టీఎంసీ బూత్ ప్రెసిడెంట్ దేవ్కుమార్ రాయ్ ఆరోపించారు. జల్పైగురిలో ఓ టీఎంసీ అభ్యర్థిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కూచ్ బెహార్ జిల్లాలో ఓ సీపీఐ(ఎం) కార్యకర్తపై దాడి జరిగింది.
ఎన్నికల లెక్కలు ఇలా..
పశ్చిమ్ బెంగాల్లో మొత్తం 73,887 సీట్లకు శనివారం ఉదయం 7 గంటలకు ఎన్నికలు మొదలయ్యాయి. వీటిల్లో 63,229 గ్రామ పంచాయతీ సీట్లు, 928 జిల్లా పరిషద్ సీట్లు ఉన్నాయి. 2.06లక్షల మంది అభ్యర్థులు బరిలో దిగారు. 5.67కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. వర్షంలోనూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
అయితే.. కూచ్బెహార్లో జరిగిన విధ్వంసానికి ఏకంగా ఓ పోలింగ్ కేంద్రమే ధ్వంసమైంది! కొందరు దుండగులు.. బరావతి ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని నాశనం చేశారు. బ్యాలెట్ పేపర్లకు నిప్పంటించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
Bengal panchayat elections live updates : పేరుకే ఇది పంచాయతీ ఎన్నిక. కానీ వాతావరణం మాత్రం అంతకుమించి ఉంది. ఏ పార్టీ కూడా ఈ ఎన్నికలను తక్కువగా తీసుకోలేదు! 2024 ఎన్నికలు సమీపిస్తుండటంతో.. తమ బలాలు, బలహీనతలను పరీక్షించుకునేందుకు ఇదొక మంచి అవకాశమని పార్టీలు భావిస్తున్నాయి.