Reservation for converted too: మత మార్పిడి చేసుకున్న దళితులకు కూడా రిజర్వేషన్లు; తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
19 April 2023, 15:10 IST
Reservation for converted too: షెడ్యూల్డ్ కులాలకు అందిస్తున్న రిజర్వేషన్లను మత మార్పిడి చేసుకున్న, ముఖ్యంగా క్రిస్టియానిటీ లోకి వెళ్లిన దళితులకు కూడా కల్పించాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
Reservation for converted too: షెడ్యూల్డ్ కులాలకు (SC) అందిస్తున్న రిజర్వేషన్ల (Reservations) ను మత మార్పిడి చేసుకున్న, ముఖ్యంగా క్రిస్టియానిటీ లోకి వెళ్లిన ఆది ద్రవిడులకు కూడా కల్పించాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎస్సీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ల (Reservations) ను ఆది ద్రవిడులకు కూడా కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి బీజేపీ మినహా అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి.
Reservtions to Adi dravidars: రిజర్వేషన్లు కల్పించాలి..
మతం మారినప్పటికీ క్రిస్టియన్ ఆది ద్రవిడులపై కుల వివక్ష, కులపరమైన వేధింపులు కొనసాగుతున్నాయని, మతం మారినా వారు అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల, వారు సామాజికంగా అభివృద్ధి చెందడం కోసం ఇతర షెడ్యూల్డ్ కులాలకు అందుతున్న రిజర్వేషన్ (Reservations) ప్రయోజనాలు క్రిస్టియన్ ఆది ద్రవిడులకు కూడా అందేలా రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
ఇతర షెడ్యూల్డ్ కులాలకు అందుతున్న రిజర్వేషన్ (Reservations) ప్రయోజనాలు సహా అన్ని రకాల చట్టబద్ధమైన రక్షణ, హక్కులు, కన్సెషన్స్ క్రిస్టియన్ ఆది ద్రవిడులకు కూడా అందేలా రాజ్యాంగ బద్ధమైన చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
BJP Opposes the resolution: బీజేపీ వ్యతిరేకత
తమ ప్రతిపాదనను మానవతా దృక్పథంతో పరిశీలించాలని ఆ తీర్మానంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. ‘‘రాజ్యాంగం ప్రకారం.. ఒకవేళ షెడ్యూల్డ్ కులాల వారిలో సిఖ్, బౌద్ధ మతాల్లోకి మారిన వారిని మినహాయిస్తే, మిగతా వారు మత మార్పిడి చేసుకుంటే వారిని షెడ్యూల్డ్ కులాలకు (SC) చెందిన వారిగా పరిగణించరు. వారికి ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు లభించవు. కానీ, చారిత్రకంగా వారు ఎస్సీలుగానే కొనసాగుతున్నారు కాబట్టి వారికి ఇతర ఎస్సీలకు లభించే అన్ని ప్రయోజనాలను అందించడం సముచితం. రిజర్వేషన్ల ద్వారానే వారికి విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయి. తద్వారా సామాజికంగా వారు అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది’’ అని ఆ తీర్మానంలో వివరించారు.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ప్రవేశ పెట్టిన ఈ తీర్మానాన్ని బీజేపీ (BJP) ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు.