South India's first Vande Bharat Express: 11న దక్షిణాదిన తొలి వందే భారత్ పరుగు
07 November 2022, 9:00 IST
Chennai-Mysore Vande Bharat Express train: దక్షిణ భారత దేశంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈనెల 11న అందుబాటులోకి రానుంది.
వందే భారత్ ఎక్స్ప్రెస్లో సీట్ల కూర్పు
చెన్నై: భారతీయ రైల్వే సోమవారం చెన్నై-మైసూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ను చెన్నైలోని ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించింది.
చెన్నై-మైసూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నవంబర్ 11న ప్రధాని మోదీ ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. ఇది దక్షిణ భారతదేశంలో అందుబాటులోకి వచ్చే మొట్టమొదటి హై-స్పీడ్ రైలు, అలాగే దేశంలో ఐదవది.
మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఫిబ్రవరి 15, 2019న న్యూఢిల్లీ-కాన్పూర్-అలహాబాద్-వారణాసి మార్గంలో ప్రారంభమైంది.
‘మేక్ ఇన్ ఇండియా' ప్రచారాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం గణనీయమైన కృషి చేసింది. ఆ విజయ గాథల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒకటిగా నిలుస్తుంది.
ఆగస్టు 15, 2021న ఎర్రకోట ప్రాకారం నుండి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ 75 వారాలలో 75 వందేభారత్ రైళ్లు దేశంలోని ప్రతి మూలను కలుపుతాయని ప్రకటించారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకత ఏమిటి?
వేగం, భద్రత, సేవల్లో మెరుగైన పనితీరు ఈ రైలు ప్రత్యేకతలు. చెన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్ కేవలం 18 నెలల్లో ఈ రైలును పట్టాలు ఎక్కించేందుకు కృషి చేసింది.
వందే భారత్ ఎక్స్ప్రెస్ గరిష్టంగా గంటకు 160 కి.మీ. వేగంతో నడుస్తుంది. శతాబ్ది రైలు తరహాలో ప్రయాణ తరగతులను కలిగి ఉంటుంది. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవం ఇస్తుంది. ఈ రైలు వేగం, సౌలభ్యం పరంగా భారతీయ రైల్వేలకు మైలురాయి వంటిది.
ఇది వేగవంతమైన ఆక్సిలరేషన్ కారణంగా అధిక వేగాన్ని అందుకోగలదు. తద్వారా ప్రయాణ సమయాన్ని 25 శాతం నుండి 45 శాతం వరకు తగ్గిస్తుంది.
ఉదాహరణకు న్యూఢిల్లీ, వారణాసి మధ్య రైలు ప్రయాణానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతుంది. వందే భారత్ ప్రస్తుతం ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించగలిగింది.
అంతేకాకుండా అన్ని కోచ్లు ఆటోమేటిక్ డోర్లతో అమర్చి ఉంటాయి. జీపీఎస్-ఆధారిత ఆడియో-విజువల్ సమాచార వ్యవస్థ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. వినోదం కోసం ఆన్బోర్డ్ హాట్స్పాట్ వైఫై, చాలా సౌకర్యవంతమైన సీటింగ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్లో రొటేటింగ్ కుర్చీలు ఉంటాయి.
అన్ని టాయిలెట్లు బయో-వాక్యూమ్ రకానికి చెందినవే. లైటింగ్ డ్యూయల్ మోడ్ లో ఉంటుంది. సాధారణ వెలుతురుతో పాటు, ప్రతి సీటుకు విడిగా అందుబాటులో ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణీకులకు అందిస్తున్న సైడ్ రిక్లైనర్ సీటు సౌకర్యం ఇప్పుడు అన్ని తరగతులకు అందుబాటులో ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కోచ్లలో 180-డిగ్రీల రొటేటింగ్ సీట్ల అదనపు ఫీచర్ ఉంది. రైలులో టచ్-ఫ్రీ సౌకర్యాలతో బయో-వాక్యూమ్ టాయిలెట్లు కూడా ఉంటాయి. ప్రతి కోచ్లో వేడి భోజనం, శీతల పానీయాలు అందించడానికి తగిన సౌకర్యాలతో కూడిన ప్యాంట్రీ ఉంటుంది.
ఒక్కో వందే భారత్ ఎక్స్ప్రెస్లో మొత్తం 1,128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. మెరుగైన భద్రత కోసం కవాచ్ (ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్)ని కలిగి ఉన్నాయి. ప్రతి కోచ్లో నాలుగు అత్యవసర విండోలు ఉంటాయి. కోచ్ వెలుపల రెండు ముందు కెమెరాలతో సహా నాలుగు ప్లాట్ఫారమ్ సైడ్ కెమెరాలు ఉంటాయి. కొత్త కోచ్లు లెవెల్-2 సేఫ్టీ ఇంటిగ్రేషన్ సర్టిఫికేషన్ను కలిగి ఉన్నాయి.
వచ్చే మూడేళ్లలో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను అభివృద్ధి చేసి తయారు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు.
టాపిక్