EWS Quota: ఈడబ్ల్యూఎస్ కోటా తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు
23 November 2022, 18:23 IST
Review petition on EWS Quota: ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది.
ఈడబ్ల్యూఎస్ కోటా సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ, నవంబర్ 23: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది.
మధ్య ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయ ఠాకూర్ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 7, 2022 నాటి ఉత్తర్వులను సమీక్షించాలని పిటిషన్లో కోరారు.
ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అందించేలా తెచ్చిన 103 రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సమర్థించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అంశంపై నాలుగు వేర్వేరు తీర్పులు వెలువడ్డాయి. మెజారిటీ ధర్మాసనం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. అయితే నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్తో పాటు జస్టిస్ రవీంద్ర భట్ ‘103వ సవరణ నుంచి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగ మౌళిక స్వరూపాన్ని ఉల్లంఘించేలా ఉంది..’ అని తీర్పునిచ్చారు.
రాజ్యాంగ సవరణలు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ‘ప్రస్తుత సవరణ ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు అర్హులు కాదు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16లను ఉల్లంఘించడమే’ అని పిటిషనర్ పేర్కొన్నారు.