Rajya Sabha Election 2022 : రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా.. ఠాక్రేకు 'మహా' షాక్!
11 June 2022, 6:30 IST
- Rajya Sabha election 2022 : రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా.. మూడింట్లో బీజేపీ హవా కనిపించింది.
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా.. ఠాక్రేకు 'మహా' షాక్!
Rajya Sabha election 2022 : రాజ్యసభ ఎన్నికల్లోనూ తన జోరును కొనసాగించింది బీజేపీ. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో.. మూడింట్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఫలితంగా విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది!
మొత్తం 16 రాష్ట్రాల్లోని.. 57 స్థానాలకు ఓటింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. అందులో 41 సీట్లలో పోటీ చేసిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 16 సీట్లకు శుక్రవారం.. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఫలితాలు సైతం వెంటనే వెలువడ్డాయి.
మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హరియాణాల్లో హోరాహోరీ పోరు సాగింది. ఒక పార్టీకి చెందిన వారు, ఇంకో పార్టీకి ఓటు వేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ.. హరియాణా, మహారాష్ట్రలో కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించారు.
‘మహా’ షాక్..!
Rajya Sabha election result 2022 : మహారాష్ట్రలో మాత్రం.. ఠాక్రే ప్రభుత్వానికి 'మహా' షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. అక్కడ ఆరు సీట్లకు ఓటింగ్ జరగ్గా.. మూడింట్లో బీజేపీ గెలిచింది. రానున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలపై ఇది ప్రభావితం చూపించే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీకి రెండు సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా మూడో సీటును కూడా దక్కించుకుంది కమలదళం. ఊహించని విధంగా ఆ పార్టీకి 10ఓట్లు ఎక్కువ పడ్డాయి!
హరియాణాలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు! పోటీ చేసిన రెండింట్లో ఓడిపోయింది. బీజేపీతో పాటు కమలదళం మద్దతు పలికిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ గెలుపొందారు.
రాజస్థాన్లో మాత్రం.. కాంగ్రెస్ తన స్థానాన్ని నిలుపుకుంది. నాలుగు సీట్లలో మూడింట్లో విజయం సాధించింది. ఒక సీటు బీజేపీకి దక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో.. కాంగ్రెస్ అధికార పక్షంగా రంగంలోకి దిగిన ఏకైక రాష్ట్రం రాజస్థాన్.
ఇక కర్ణాటకలో.. నాలుగు సీట్లకు పోటీ జరగ్గా.. అధికార బీజేపీ మూడిట్లో గెలుపొందింది. ఒకటి కాంగ్రెస్కు దక్కింది.