Parliament: మూడు సార్లు వాయిదా పడిన రాజ్యసభ
27 July 2022, 13:06 IST
- భోజన విరామానికి ముందే రాజ్యసభ మూడు సార్లు వాయిదా పడింది.
జీఎస్టీ పెరుగుదలపై పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టిన కాంగ్రెస్ సహా విపక్షాల సభ్యులు
న్యూఢిల్లీ, జూలై 27: ఎంపీల సస్పెన్షన్, ఇతర సమస్యలపై విపక్షాల నిరసనల మధ్య బుధవారం భోజన విరామానికి ముందు రాజ్యసభ కార్యకలాపాలు మూడుసార్లు వాయిదా పడ్డాయి.
ఎగువ సభ మొదట ఉదయం 11 గంటలకు సమావేశమైన వెంటనే ఒకసారి వాయిదా పడింది. ఆపై ప్రశ్నోత్తరాల సమయంలో రెండుసార్లు వాయిదాపడింది.
మధ్యాహ్నం 12 గంటలకు మొదటి వాయిదా తర్వాత సభ సమావేశమైన వెంటనే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రూల్ 256ను అమలు చేసి ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ పేరు చదివారు. ఆ వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సంజయ్ సింగ్ను ఈ వారాంతం వరకు సస్పెండ్ చేయాలన్న తీర్మానం ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యులు వెల్లోకి వెళ్లి గందరగోళం కొనసాగించినా మూజువాణి ఓటు ద్వారా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.
తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మన్ సంజయ్ సింగ్ను కోరారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య డిప్యూటీ చైర్మన్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
సస్పెండైన సభ్యుడు సంజయ్ సింగ్ సభ మళ్లీ సమావేశమైనప్పుడు వెల్లోనే ఉన్నారు. మరొక ఆప్ సభ్యుడు నినాదాలు చేశారు.
ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులు కూడా వెల్లోకి వచ్చారు. సస్పెండ్ అయిన సభ్యుడిని బయటకు వెళ్లమని హరివంశ్ విజ్ఞప్తి చేసినప్పటికీ వినలేదు.
అనంతరం విపక్ష సభ్యుల ఆందోళనతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఇప్పటివరకు 20 మంది ఎంపీలను ఎగువ సభ నుంచి సస్పెండ్ చేశారు.
ధరల పెరుగుదల, గుజరాత్లో జరిగిన హూచ్ విషాదాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నందున సభ ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేకపోయింది.
ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అంశాన్ని లేవనెత్తాలని భావించాయి. గుజరాత్లో జరిగిన హూచ్ దుర్ఘటనపై ఆప్కి చెందిన సంజయ్సింగ్ ప్లకార్డులు పట్టుకుని వెల్లోకి వెళ్లారు.
కాగా రూల్ 267 కింద పలువురు సభ్యులు ఇచ్చిన నోటీసులను తాను అనుమతించడం లేదని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.