MLA gets cow to assembly: ఆవుతో అసెంబ్లీకి.. ఆవు ఏం చేసిందంటే..
20 September 2022, 10:17 IST
- MLA gets cow to assembly: రాజస్తాన్లో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అసెంబ్లీకి ఆవును తీసుకొచ్చారు. ఇంతకీ ఆయన ఆవును ఎందుకు తీసుకొచ్చారు? వచ్చాక ఆ ఆవు ఏం చేసింది? ఈ కథనంలో తెలుసుకోండి.
ఆవుతో అసెంబ్లీకి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే సురేష్ సింగ్ రావత్
జైపూర్ (రాజస్థాన్), సెప్టెంబర్ 20: రాజస్తాన్లోని పుష్కర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ రావత్ సోమవారం రాజస్థాన్ అసెంబ్లీకి ఆవును తీసుకొచ్చారు. పశువులలో లంపి వ్యాధి వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోవడంపై నిరసనగా ఈ చర్యను చేపట్టారు.
అయితే బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ చేరుకుని స్టేట్మెంట్ ఇవ్వడం ప్రారంభించిన వెంటనే ఆవు అక్కడి నుంచి పారిపోయింది.
సెప్టెంబరు 19న రాజస్థాన్ ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించారు. లంపి వ్యాధికి పరిష్కారం కనుగొనడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశం అని, అయితే దీనికి టీకాలు కేంద్రం ఇస్తుందని చెప్పారు.
‘ఈ చర్మవ్యాధికి సంబంధించి ఆగస్టు 15న సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతలు, మత పెద్దలతో మాట్లాడి ఆవుల ప్రాణాలను చర్మవ్యాధుల నుంచి ఎలా కాపాడాలన్న అంశంపై చర్చించాం. ఇది మా ప్రాధాన్యత అంశం. అయితే కేంద్ర ప్రభుత్వం టీకాలు, మందులు ఇవ్వాల్సి ఉంది..’ అని సీఎం గెహ్లాట్ ట్వీట్ చేశారు.
లంపి వ్యాధి పశువులను ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ఇది కొన్ని జాతుల ఈగలు, దోమలు లేదా పేలు వంటి రక్తాన్ని తినే కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. ఇది జ్వరం, చర్మంపై కణుపులను పుట్టేలా చేస్తుంది. పశువుల మరణానికి దారితీస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఆవులు పెద్ద సంఖ్యలో చనిపోయాయి.
అంతకుముందు సెప్టెంబర్ 18 న మహారాష్ట్రలో లంపీ వైరస్ బారిన పడి 126 పశువులు చనిపోయాయని, 25 జిల్లాల్లో ఈ వ్యాధి సోకిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ శనివారం తెలిపింది.
జల్గావ్ జిల్లాలో 47, అహ్మద్నగర్ జిల్లాలో 21, ధులేలో 2, అకోలాలో 18, పూణేలో 14, లాతూర్లో 2, సతారాలో 6, బుల్దానాలో ఐదు, అమరావతిలో ఏడు సహా మొత్తం 126 సోకిన జంతువులు చనిపోయాయి..’ అని ఆ ప్రకటన పేర్కొంది.
లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డి) వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, జంతువుల నుండి లేదా ఆవు పాల ద్వారా మానవులకు సంక్రమించదని అధికార వర్గాలు తెలిపాయి.
కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దేశంలోని పశువులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో పశువులను లంపి చర్మ వ్యాధి నుండి రక్షించడానికి దేశీయ వ్యాక్సిన్ లంపి-ప్రోవాక్ను ఆగస్టు 10న ప్రారంభించారు.
ఈ వ్యాక్సిన్ను నేషనల్ ఎక్వైన్ రీసెర్చ్ సెంటర్ హిసార్ (హర్యానా) ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(బరేలీ) సహకారంతో అభివృద్ధి చేసింది.
మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ పంజాబ్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో 'లంపీ స్కిన్ డిసీజ్' కలిగిస్తున్న నష్టాన్ని పట్టించుకోలేదని, ఒక్కో జంతువుకు రూ. 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రంలోని వందలాది గోవులకు ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారిందని కూడా ఆమె నొక్కి చెప్పారు.