Wrestlers Protest: మా “మన్ కీ బాత్” కూడా వినండి: ప్రధాని మోదీకి రెజర్ల విజ్ఞప్తి
30 April 2023, 19:51 IST
- Wrestlers Protest: ప్రధాని మోదీ తమ మన్ కీ బాత్ వినాలని రెజ్లర్లు కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారం రోజులుగా రెజర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు.
జంతర్ మంతర్ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న రెజ్లర్లు
Wrestlers Protest: భారత టాప్ రెజర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh)పై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దే వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలో మీడియాతో ఆదివారం మాట్లాడారు రెజ్లర్లు. తమ మన్ కీ బాత్ (మనసులోని మాట)ను కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) వినాలని కోరారు. ప్రధాని మోదీ 100వ మన్ కీ బాత్ (Mann ki Baat) ప్రసంగం చేసిన రోజే రెజర్లు ఈ విజ్ఞప్తి చేశారు. వివరాలివే..
న్యాయం జరిగే వరకు..
Wrestlers Protest: భారత టాప్ రెజర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ సహా మరికొందరు రెజర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. న్యాయం జరిగే వరకు నిరసన విరమించేది లేదని బజరంగ్ చెప్పారు. రెజర్ల “మన్ కీ బాత్” ప్రధాని వినాలని వినేశ్ ఫొగాట్ కోరారు. “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మా మన్ కీ బాత్ వినాలి. మాకు కోట్లాది మంది మద్దతు తెలుపుతున్నారు. ఇది మా బలం. ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మావైపు ఉన్నారో తెలియదు” అని వినేశ్ ఫొగాట్ అన్నారు.
వారం రోజులుగా..
Wrestlers Protest: ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బ్రిజ్ భూషణ్పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్పై దర్యాప్తు జరిపి, డబ్ల్యూఎఫ్ఐ నుంచి బయటికి పంపాలని రెజర్లు డిమాండ్ చేస్తున్నారు.
Wrestlers Protest: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సహా చాలా మంది రాజకీయ నాయకులు.. రెజర్ల ఆందోళన శిబిరానికి వెళ్లి మద్దతు తెలియజేశారు. రెజ్లర్ల నిరసనపై ప్రధాని మోదీ మౌనం వీడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
అలా అయితే రాజీనామాకు సిద్ధం: బ్రిజ్ భూషణ్
నిరసన చేస్తున్న రెజర్లు ఇళ్లకు వెళ్లి.. ప్రశాంతంగా నిద్రపోగలమని చెబితే తాను రాజీనామా చేస్తానని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చెప్పారు. “నా రాజీనామా తర్వాత వారు వెనక్కి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోతారంటే నేను రాజీనామా చేసేందుకు సిద్ధం” అని న్యూస్ ఏజెన్సీ పీటీఐతో బ్రిజ్ భూషణ్ అన్నారు. దీపేందర్ హూడా అఖాడా(ట్రైనింగ్ సెంటర్)కు చెందిన వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
“ఈ మహిళా రెజర్లందరూ మహాదేవ్ రెజ్లింగ్ అకాడమీ నుంచి వచ్చిన వారే. దీపిందర్ హూడా (కాంగ్రెస్ నేత)కు చెందినదే ఆ అఖాడా. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల చేతిలో రెజ్లర్లు కీలుబొమ్మలుగా మారారు” అని బ్రిజ్ భూషణ్ ఆరోపించారు.