Man kills ex wife : విడాకులపై 'పోస్ట్' పెట్టిందని- మహిళను చంపేసిన మాజీ భర్త!
24 July 2022, 15:37 IST
- Man kills ex wife : ఆమెకు పెళ్లి జరిగి ఏడాది కూడా అవ్వలేదు. అప్పుడే విడాకులకు అప్లై చేసింది. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టింది. అంతే.. కోపం పెంచుకున్న ఆ మహిళ మాజీ భర్త.. 100కిలోమీటర్లు ప్రయాణించి ఆమెను చంపేశాడు. అమెరికా చికాగోలో జరిగింది ఈ ఘటన.
తమ విడాకుల గురించి 'పోస్ట్' పెట్టిందని.. మహిళను చంపేసిన మాజీ భర్త!
Man kills ex wife : అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ సంతతికి చెందిన మహిళను ఆమె మాజీ భర్త హత్య చేశాడు. తమ విడాకులపై సామాజిక మాధ్యమాల్లో ఆ మహిళ పోస్టులు పెట్టడంతో కోపం తెచ్చుకున్న ఆ పాకిస్థాన్ సంతతి వ్యక్తి.. ఈ దారుణానికి ఒడిగట్టాడు.
100కిలోమీటర్లు ప్రయాణించి..
29ఏళ్ల సానియా ఖాన్.. అమెరికా ఓ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. కాగా.. పెళ్లి జరిగి ఏడాది తిరగకుండానే ఆమె తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి చికాగోలో నివాసముంటోంది.
కొన్ని రోజుల క్రితం.. తన జీవితంలో విడాకుల విషయంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది. విడాకులు, అనంతరం తన జీవితంలో వచ్చిన మార్పులు, ఆ డిప్రెషన్ను తాను ఎలా బయటపడిందో వివరించింది. 'దక్షిణాసియా మహిళకు డివోర్స్ అంటే పెద్ద విషయం. జీవితంలో విఫలమయ్యాం అన్న భావన కలుగుతుంది. మనకి ఎమోషనల్ సపోర్ట్ కూడా ఉండదు,' అని ఆమె రాసుకొచ్చింది.
ఆ పోస్టులపై కోపం తెచ్చుకున్న సానియా ఖాన్ మాజీ భర్త రహీల్ అహ్మెద్.. జార్జియా నుంచి 100కిలోమీటర్లు ప్రయాణించి గత సోమవారం చికాగోకు వెళ్లాడు. సానియా ఇంటికి వెళ్లి.. కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తనని తాను పొడుచుకున్నాడు. ఇంట్లో నుంచి అరుపుల శబ్దం వినిపించడంతో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వచ్చేసరికి.. సానియా ఖాన్ ప్రాణాలు కోల్పోయింది. కాగా.. రహీల్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ అతను కూడా మరణించాడు. ఘటనాస్థలం నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన చికాగోవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సానియా ఖాన్కు మద్దతుగా అక్కడి ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరుతో పోస్టులు పెడుతున్నారు.