దావూద్ గ్యాంగ్ను వేటాడుతున్న ఎన్ఐఏ
13 May 2022, 18:21 IST
అంతర్జాతీయ ఉగ్రవాది, భారత్లో పలు ఉగ్రదాడులకు సూత్రధారి, ముంబై కేంద్రంగా
`అండర్ వరల్డ్`ను ఏకఛత్రాధిపత్యంలా ఏలిన `దావూద్ భాయి` ప్రభ మసకబారింది. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఆయన అనుచర వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.
దావూద్ ఇబ్రహీం(ఫైల్ ఫొటో)
ఇటీవల ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ముంబైలో 24 చోట్ల దాడులు చేసి, సోదాలు నిర్వహించింది. డీ గ్యాంగ్, చోటా షకీల్ అనుచరులు లక్ష్యంగా ఈ దాడులు చేసింది. చోటా షకీల్ అనుచరలు ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఆరిఫ్ అబూబాకర్ షేక్(59), షబ్బీర్ అబూబాకర్ షేక్(51) అనే ఈ ఇద్దరు పశ్చిమ ముంబై శివార్లలో దావూద్ గ్యాంగ్ కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్నారు. బలవంతపు వసూళ్లు, హత్యలు, ఉగ్ర సంస్థలకు నిధులను సమకూర్చడం.. వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. `పాకిస్తాన్లో ఉన్న దావూద్ గ్యాంగ్ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు ఈ సిండికేట్ నడుస్తుంది` అని వివరించారు. ఇక్కడ డీ గ్యాంగ్లో క్రియాశీలకంగా ఉన్నారన్న అనుమానం ఉన్న మరో 21 మందికి సమన్లు ఇచ్చామన్నారు. ముంబై అసాంఘిక వ్యవహారాల్లో డీ గ్యాంగ్ పాత్ర గురించి చాలా సమాచారం సేకరించామని, అనుమానితుల నుంచి ఎలక్ట్రానిక్ డివైజెస్, డాక్యుమెంట్స్, నగదు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
చోటా షకీల్ బావమరిది కీలకం
చోటా షకీల్ బావమరిది సలీమ్ ఖురేషీ అలియాస్ సలీమ్ ఫ్రూట్, మాహిమ్, హజీ అలీ దర్గాల మేనేజింగ్ ట్రస్టీ సొహయిల్ ఖాంద్వానీ, బాలీవుడ్ నిర్మాత 1993 ముంబై పేలుళ్లలో కీలక నిందితుడు సమీర్ హింగోరనీ, హవాలా ఆపరేటర్ అబ్దుల్ ఖయ్యూం, క్రికెట్ బుకీ, బిల్డర్ అజయ్ గోశాలియా, మొబిడా భీవండీవాలా, గుడ్డూ పఠాన్, అస్లాం సరోడియా ల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. భారత్లో దావూద్ ఇబ్రహీం ప్రత్యక్ష, పరోక్ష కార్యకలాపాలపై కొంత సమాచారం సేకరించమన్నారు. లష్కరే తోయిబా, జైషె మొహమ్మద్, అల్ కాయిదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో డీ గ్యాంగ్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారముందన్నారు. భారత్లోని ప్రముఖులు, ప్రముఖ ప్రదేశాలపై ఉగ్ర దాడులు చేసేందుకు `డీ కంపెనీ` ఒక ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసినట్లు తమకు నిఘా సమాచారం అందిందన్నారు. దావూద్ ఇబ్రహీం ను 2003లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు.
టాపిక్