కశ్మీర్లో ఉగ్రవాదుల మరో ఘాతుకం
24 May 2022, 19:39 IST
కశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. శ్రీనగర్లో నడిరోడ్డుపై చిన్నారి కూతురితో కలిసి వెళ్తున్న పోలీస్ కాన్స్టేబుల్పై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సైఫుల్లా ఖాద్రీ అనే ఆ పోలీస్ మరణించగా, ఆయన చిన్నారి కూతురు తీవ్రంగా గాయపడింది.
శ్రీనగర్లో భద్రతాదళాల పహారా(ఫైల్ ఫొటో)
శ్రీనగర్లో మంగళవారం ఈ దారుణం జరిగింది. సౌరా ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న పోలీస్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆ పోలీస్ సైఫుల్లా ఖాద్రీ చనిపోగా, ఆయన చిన్నారి కూతురు తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ పాప పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. పోలీస్ సైఫుల్లా అమరుడయ్యాడని, ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నామని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని జమ్మూకశ్మీర్ పోలీస్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కశ్మీరీ పండిట్, ప్రభుత్వ ఉద్యోగి అయిన రాహుల్ భట్ను బుద్గాం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయంలోనే ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన మరువకముందే, టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.
`జైషే మొహమ్మద్` పనే
సైఫుల్లా ఖాద్రీపై కాల్పులు జరిపింది పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ సభ్యులేనని పోలీసులు భావిస్తున్నారు. బారాముల్లా జిల్లాలో ఇటీవల ఒక సర్పంచ్ను కాల్చి చంపిన ఘటనకు సంబంధించి సోమవారం ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు.
టాపిక్