JEE Main Answer Key 2022 : జేఈఈ మెయిన్ సెషన్ 2 ఆన్సర్ కీ విడుదల.. ఏమైనా అభ్యంతరాలున్నాయా?
04 August 2022, 9:31 IST
- జేఈఈ మెయిన్ సెషన్-2కు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలైంది. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే.. చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
జేఈఈ మెయిన్ రెండో విడతకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసింది ఎన్టీఏ. అయితే ఎవరికైనా అభ్యంతరాలుంటే.. ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు చెల్లించాలి. ఫీజు మళ్లీ తిరిగిరాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. జేఈఈ మెయిన్ రెండో సెషన్ కు సంబంధించి.. క్వశ్చన్ పేపర్లు అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి. జేఈఈ మెయిన్ పేపర్-1 (బీఈ/బీటెక్), పేపర్-2ఎ (బీఆర్క్), పేపర్-2బి (బీప్లానింగ్) పరీక్షల ఆన్సర్ కీని రెస్పాన్స్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
రెండో విడత ప్రాథమిక కీ చూసుకున్న వారకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. వెంటనే అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి. అందులో తమ అభ్యంతరాలను చెప్పొచ్చు. ఆగస్టు 5న అంటే శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా తెలిపాలి. ఇప్పుడు అభ్యంతరాలు చెప్పిన తర్వాత.. ఏమైనా ఉంటే వాటిని లిస్ట్ అవుట్ చేస్తుంది ఎన్టీఏ. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటుగా.. అభ్యర్థుల వ్యక్తిగత స్కోరు కార్డు, మెరిట్ లిస్ట్ విడుదల అవుతుంది. జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2కు సంబంధించిన ఫలితాలు.. ఆగస్టు 6న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించనుంది. ఫైనల్ రిజల్ట్, ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటిస్తారు.
ఇలా చూడండి..
మొదటగా jeemain.nta.nic.in అధికారిక వెబ్ సైట్ వెళ్లాలి.
హోమ్ పేజీలో JEE Main 2022 Session 2, Display Question Paper and Answer Key అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ లేదా అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో కూడిన పేజీ వస్తుంది.
అభ్యర్థి తన వివరాలు నమోదు చేసి లాగిన్ కావాలి.
స్క్రీన్ పై క్వశ్చన్ పేపర్, ఆన్సర్ కీ కనిపిస్తాయి. ఆన్సర్ కీ చెక్ చేసుకోవాలి.
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జులై 25 నుంచి 30 వరకు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 6.29 లక్షల మంది హాజరయ్యారు. జేఈఈ మెయిన్ మెుదటి సెషన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగాయి. ఫలితాలు.. జులై 11న విడుదలయ్యాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జేఈఈ అడ్వాన్స్డ్-2022 పరీక్ష ఆగస్టు 28న జరుగుతుంది. ఈ ఏడాది ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తున్నారు.