IMD rain alert : ఈ రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు..!
17 July 2023, 9:51 IST
IMD rain alert news : రానున్న కొన్ని రోజుల పాటు ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వానలు పడతాయి.
ఐదు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
IMD rain alert : గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో అల్లాడిపోయిన ఉత్తర భారతంలోని ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్ ఇచ్చింది ఐఎండీ. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
"తూర్పు భారతంలో 5 రోజుల్లో వర్షాలు పెరుగుతాయి. పశ్చిమ తీరంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కనీసం 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి," అని భారత వాతావరణశాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఆదివారం ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఇచ్చింది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. జులై 18 తర్వాత రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు కాస్త మెరుగుపడతాయని వెల్లడించింది.
వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా..
Himachal Pradesh rains alert : హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్లో రెండు రోజుల పాటు, హరియాణా- ఛండీగఢ్లో ఈరోజు, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్లో నాలుగు రోజుల పాటు, పశ్చిమ్ రాజస్థాన్లో ఈ నెల 18, 19న.. జమ్ముకశ్మీర్లో జులై 20న భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఝార్ఖండ్, ఒడిశాల్లోను రానున్న రోజుల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంటుంది. బిహార్, పశ్చిమ్ బెంగాల్, సిక్కింలో రానున్న 24 గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి.
ఇదీ చూడండి:- IMD alert : యెల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్స్కి అర్థాలు ఏంటి?
గోవా, కోంకణ్, మధ్య మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు పడతాయి. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్తో పాటు ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
ఇక దక్షిణ భారతం విషయానికొస్తే.. మధ్య కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, కేరళ- మాహేలో ఈనెల 19, 20న వర్షాల ప్రభావం ఉంటుంది.
దిల్లీలో పరిస్థితులు ఇలా..
Delhi floods latest news : మరోవైపు దిల్లీలో పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడుతున్నాయి. యమునా నది శాంతించడంతో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. కానీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో రోడ్లు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాలలో రోడ్డు సేవలను అధికారులు పునరుద్ధరించారు. కానీ లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు.