ICICI hikes Rates: వడ్డీ రేట్లు పెంచేసిన ఐసీఐసీఐ బ్యాంకు.. 0.5 శాతం పెంపు
09 June 2022, 11:24 IST
- ఐసీఐసీఐ బ్యాంకు తన వడ్డీ రేట్లను పెంచేసింది. ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు కూడా వడ్డీ రేట్లు పెంచింది.
వడ్డీ రేట్లను పెంచేసిన ఐసీఐసీఐ (ప్రతీకాత్మక చిత్రం)
ఐసీఐఐసీ బ్యాంక్ తన వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. సంవత్సరానికి 8.60 శాతానికి పెంచింది. జూన్ 8 నుంచే ఇది అమల్లోకి వస్తుంది. బుధవారం మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన వెంటనే ఐసీఐసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంకు మే 4, జూన్ 8 తేదీల్లో వరుసగా 0.40 శాతం, 0.50 శాతం మేర వడ్డీ రేట్లను పెంచేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం ‘ఆర్బీఐ పాలసీ రెపో రేటు జూన్ 8, 2022 నుండి 4.90 శాతంగా అమలులోకి వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ (ఐ-ఈబీఎల్ఆర్) ఆర్బీఐ పాలసీ రెపో రేటును ప్రతిబింబిస్తుంది. ఐ-ఈబీఎల్ఆర్ 8.60 శాతంగా ఉంటుంది. జూన్ 8, 2022 నుండి ఇది అమలులోకి వస్తుంది..’ అని తెలిపింది. ఈబీఎల్ఆర్ అంటే.. అంతకంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి బ్యాంకుకు అనుమతి లేదని అర్థం.
ఈబీఎల్ఆర్ చివరగా మే 5న 40 బేసిస్ పాయింట్లు పెరిగి 8.10 శాతానికి చేరుకుంది. మే 4న సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును 4.40 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించిన తర్వాత ఐసీఐసీఐ కూడా పెంచింది.
కాగా ఐసీఐసీఐ జూన్ 1, 2022 నుండి నిధుల ఆధారిత రుణ (ఎంసీఎల్ఆర్) రేట్లను కూడా పెంచింది. ఒక రోజు, ఒక నెల, మూడు నెలల కాల వ్యవధిలో రుణాల కోసం ఎంసీఎల్ఆర్ 7.30 శాతం, 7.35 శాతంగా ఉన్నాయి. ఆరు నెలలు, ఒక సంవత్సరం కాలవ్యవధికి రుణ రేట్లు వరుసగా 7.50 శాతం, 7.55 శాతంగా ఉన్నాయి.
టాపిక్