Cabinet decisions on MSP: రబీ పంటల కనీస మద్ధతు ధరలను పెంచిన ప్రభుత్వం; గోధుమపై అత్యధికంగా..
18 October 2023, 17:26 IST
Cabinet decisions on MSP: గోధుమ ప్రధాన పంటగా పండించే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. గోధమ మద్ధతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
Cabinet decisions on MSP: 2024-25 మార్కెటింగ్ సీజన్లో గోధుమ కనీస మద్దతు ధర (MSP)ను క్వింటాల్కు రూ. 150 పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా పెంపుతో గోధమ కనీస మద్ధతు ధర క్వింటాల్ కు రూ.2,275కి చేరుతుంది. గోధుమలు పండించే రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్ గోధుమ ఎంఎస్పీ పెంపుపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత గోధుమకు అత్యధిక మద్ధతు ధర లభించడం ఇదే ప్రథమం.
2023-24 మార్కెటింగ్ సీజన్
ప్రస్తుతం, 2023-24 మార్కెటింగ్ సీజన్కు (ఏప్రిల్-మార్చి) గోధుమలపై కనీస మద్ధతు ధర క్వింటాల్కు రూ. 2,125గా ఉంది. తాజాగా కేంద్ర కేబినెట్ క్వింటాల్ కు రూ. 150 పెంచడంతో, గోధుమ ఎంఎస్పీ రూ. 2,275 కి పెరిగింది. 2024-25 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి అన్ని రబీ పంటలకు కనీస మద్ధతు ధరను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. సీఏసీపీ సిఫారసుల మేరకు ఆరు రబీ పంటల ఎంఎస్పీని పెంచామని, గోధుమల ఎంఎస్పీని క్వింటాల్కు రూ.150 పెంచామని తెలిపారు. రబీ పంటల్లో గోధుమ అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వం తన ఏజెన్సీల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేస్తుంది.
ఇతర పంటల ఎంఎస్పీ
ఈ సీజన్ లో కందిపప్పు కనీస మద్ధతు ధరను ప్రభుత్వం భారీగా పెంచింది. కంది (మసూర్ ) పప్పు ఎంఎస్పీని క్వింటాల్ కు రూ. 425 పెంచారు. ఆవాలు కనీస మద్దతు ధరను రూ. 200 పెంచారు. కుసుమల మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 150 పెంచారు. బార్లీ మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 115 పెంచారు.