Emergency Alert: మీ ఫోన్ కు పెద్ద సౌండ్ తో ‘ఎమర్జెన్సీ అలర్ట్’ మెసేజ్ వచ్చిందా?.. ఇలా చేయండి..
15 September 2023, 14:39 IST
Emergency Alert: కొందరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు శుక్రవారం ఉదయం పెద్ద శబ్దంతో ఒక మెసేజ్ వచ్చింది. రెడ్, అండ్ బ్లాక్ కలర్స్ తో స్క్రీన్ పై ఈ మెసేజ్ కనిపించడంతో యూజర్లు భయాందోళలకు, గందరగోళానికి గురయ్యారు.
ప్రతీకాత్మక చిత్రం
Emergency Alert: అకస్మాత్తుగా పెద్ద సౌండ్ తో ఫ్లాష్ మెసేజ్ వచ్చిన మొబైల్ ఫోన్ వినియోగదారులు కొద్ది సేపు భయాందోళలకు గురయ్యారు. ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన సాంపిల్ టెస్టింగ్ మెసేజ్ అని, భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆ తరువాత వివరణ ఇచ్చింది. ఈ మెసేజ్ పై స్పందించాల్సిన అవసరం లేదని, ఇగ్నోర్ చేయాలని యూజర్లకు సూచించింది.
ప్రభుత్వ వివరణ
ప్రకృతి విలయాలు, ఇతర అనూహ్య ప్రమాదాల సమయంలో దేశ ప్రజలను అప్రమత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక అలర్ట్ సిస్టమ్ ను రూపొందిస్తోంది. ఆ అలర్ట్ సిస్టమ్ ను ఈ రోజు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అందువల్లనే కొందరు యూజర్లకు ఈ అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఇది టెస్టింగ్ పర్పస్ లో పంపించిన మెసేజ్ మాత్రమేనని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. టెలీకాం విభాగం లోని సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ప్రయోగాత్మకంగా కొందరు మొబైల్ యూజర్లకు ఈ మెసేజ్ ను పంపించారు.
అప్రమత్తం చేయడానికి..
భూకంపం, సునామీ వంటి ఏదైనా ప్రకృతి విపత్తు సమయంలో కానీ, మరేదైనా అనూహ్య ప్రాణనష్టానికి కారణమయ్యే విపత్తు తలెత్తే సమయంలో కానీ దేశ వ్యాప్తంగా ఒకేసారి ప్రజలందరికీ అలర్ట్ మెసేజ్ ను పంపించి, వారిని అప్రమత్తం చేసి, వారిని ఆ ముప్పు నుంచి కాపాడే లక్ష్యంతో ఈ అలర్ట్ సిస్టమ్ ను రూపొందించారు. దీనిని పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ (Pan-India Emergency Alert System) గా పేరు పెట్టారు. ఈ సిస్టమ్ జాతీయ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (National Disaster Management Authority) ఆధ్వర్యంలో ఉంటుంది. అయితే, ఈ మెసేజ్ చాలా మంది యూజర్లను గందరగోళానికి గురి చేసింది. కొందరు ఇది స్పామ్ మెసేజ్ అని, మరికొందరు వైరస్ మెసేజ్ అని భావించారు.