monthly charge for Twitter: నెలకు 8 డాలర్లు.. ట్విటర్ ఛార్జీలపై మస్క్
02 November 2022, 10:26 IST
monthly charge for Twitter accounts: ట్విటర్ వెరిఫైడ్ అకౌంట్స్కు నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అధినేత ఇలాన్ మస్క్ ప్రకటించారు.
ట్విటర్ బ్లూటిక్ యూజర్లు ఇక నెలకు 8 డాలర్లు చెల్లించాలంటున్న మస్క్
బ్లూటిక్ పొందిన వెరిఫైడ్ ట్విటర్ అకౌంట్స్కు నెలకు 8 డాలర్ల చొప్పున (సుమారుగా 661 రూపాయలు) చెల్లించాలని ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ కొత్త యజమాని ఇలాన్ మస్క్ ప్రకటించారు. మంగళవారం రాత్రి సంబంధిత అంశంపై ఆయన పలు ట్వీట్లు చేశారు. వెరిఫైడ్ అకౌంట్స్కు రిప్లైస్ పొందడంలో, మెన్షన్స్లో, సెర్చ్ విషయంలో ప్రాధాన్య ఉంటుందని చెప్పారు. అలాగే సుదీర్ఘ వీడియో, ఆడియో పోస్టు చేసే సౌలభ్యం ఉంటుందని వివరించారు. అలాగే అడ్వర్టయిజ్మెంట్ల బాధ కూడా అంతగా ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు వెరిఫైడ్ యూజర్లు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ట్విటర్ బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జీకి 20 డాలర్ల ఫీజు ఉంటుందని వచ్చిన రిపోర్ట్స్పై ఇలాన్ మస్క్ స్పందించారు. రచయిత స్టీఫెన్ కింగ్ ఈ రుసుము చెల్లించాల్సిన పరిణామంపై తన అసంతృప్తి వ్యక్తం చేయగా దానికి మస్క్ స్పందిస్తూ ‘కంపెనీ తన వ్యయాలను భరించగలగాలి..’ అని ట్వీట్ చేశారు.
ఈ సోషల్ మీడియా సంస్థ ఇప్పటి వరకు ఒక ప్రత్యేకమైన సబ్స్క్రిప్షన్ సర్వీసు ఆఫర్ చేస్తూ వచ్చింది. గత ఏడాది జూన్లో ప్రారంభించిన ఫీచర్ ద్వారా నెలకు 4.99 డాలర్లు చెల్లించి కొన్ని సౌలభ్యాలను పొందవచ్చు. యూజర్లు తాము చేసిన ట్వీట్లను ఎడిట్ చేయొచ్చు. అలాగే ట్విటర్ డిస్ప్లే డిజైన్ మార్చుకోవచ్చు. అలాగే యాప్ ఐకాన్ కూడా మార్చుకోవచ్చు.
ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో అనేక చేదు అనుభవాలను ఎదుర్కొన్న మస్క్.. తాను వచ్చీ రాగానే అనేక మార్పులు చేపట్టారు. వెనువెంటనే ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, కంపెనీ లీగల్ అఫైర్స్, పాలసీ చీఫ్ విజయ గద్దెను విధుల నుంచి తొలగించేశారు.
ట్విటర్ను టేకోవర్ చేశాక తాను దానికి ఏకైక డైరెక్టర్గా ఉన్నానని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థలకు సమర్పించిన లేఖల్లో వివరించినట్టు రాయిటర్స్ తెలిపింది. బ్రెట్ టెయిలర్, పరాగ్ అగర్వాల్, ఒమిడ్ కార్డెస్టని, డేవిడ్ రాసెన్బ్లాట్, మార్థా లేన్ ఫాక్స్, పాట్రిక్ పిచెట్, ఎగాన్ డర్బన్, ఫై ఫై లి, మిమి అలెమయెహో తదితర డైరెక్టర్లు ఇకపై డైరెక్టర్లుగా ఉండరని మస్క్ తన లేఖల్లో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థలకు నివేదించారు.