Wrestlers Protest: “నన్ను ఉరితీయండి.. కానీ వాటిని ఆపకండి”: రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ వ్యాఖ్యలు
01 May 2023, 23:05 IST
- Wrestlers Protest: రెజర్ల ఆందోళన సాగుతున్న తరుణంలో.. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాల గురించి మాట్లాడారు
మీడియాతో సోమవారం మాట్లాడుతున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
Wrestlers Protest: భారత టాప్ రెజర్లు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) మరోసారి స్పందించారు. ప్రముఖ రెజర్లు ఆందోళన చేస్తుండటంతో దేశంలో నాలుగు నెలలుగా రెజ్లింగ్ పోటీలు జరగడం లేదని అన్నారు. కావాలంటే తనను ఉరి వేయండని, కానీ దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకోదవద్దని మీడియా సమావేశంలో సోమవారం అన్నారు బ్రిజ్ భూషణ్. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద టాప్ రెజర్లు ఆందోళన చేస్తున్నారు. వారికి చాలా మంది రాజకీయ నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఈ తరుణంలో బ్రిజ్ భూషణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వివరాలివే.
Wrestlers Protest: దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాలు నిలిచిపోతే జూనియర్ రెజ్లర్లు చాలా నష్టపోతారని బ్రిజ్ భూషణ్ అన్నారు. పోటీల నిర్వహణకు అడ్డుతగలకూడదని కోరారు. “నాలుగు నెలల నుంచి అన్ని రెజ్లింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కావాలంటే నన్ను ఉరి తీయండి, కానీ రెజ్లింగ్ కార్యకలాపాలను మాత్రం ఆపకండి అని నేను చెబుతున్నా. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. క్యాడెట్ నేషనల్స్ జరగనివ్వండి. మహారాష్ట్ర, తమిళనాడు, త్రిపుర.. ఎక్కడైనా పోటీలను నిర్వహించండి” అని బ్రిజ్ భూషణ్ అన్నారు.
Wrestlers Protest: లైగింక ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI చీఫ్ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జనవరిలోనూ రెజ్లర్లు కొంతకాలం ఆందోళన చేశారు. ఆ తర్వాత విరమించారు. అయితే, ఎలాంటి పురోగతి లేకపోవటంతో ఏప్రిల్ 23న మరోసారి నిరసనకు దిగారు. అప్పటి నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ప్రముఖ రెజర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా సహా మరికొందరు రెజర్లు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు.
Wrestlers Protest: రెజర్ల ఆందోళనకు కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ సోమవారం మద్దతు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన శిబిరానికి వెళ్లిన ఆయన రెజ్లర్లతో మాట్లాడారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ సహా చాలా పార్టీలకు చెందిన నాయకులు రెజర్ల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.
Wrestlers Protest: ఇప్పటి వరకు బ్రిజ్ భూషణ్పై రెండు ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. అయితే, ఫెడరేషన్ బాధ్యతల నుంచి బ్రిజ్ భూషణ్ను తప్పించాలని రెజర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని చెబుతున్నారు.