CEO son murder case: బెంగళూరు స్టార్టప్ సీఈఓ తన నాలుగేళ్ల కొడుకును చంపేసిన కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు
10 January 2024, 17:04 IST
CEO son murder case: గోవాలోని ఒక సర్వీస్ అపార్ట్ మెంట్ లో బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ సీఈఓ తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న కేసులో సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
CEO son murder case: తన నాలుగేళ్ల కొడుకును గోవా సర్వీస్ అపార్ట్మెంట్లో హత్య చేయడానికి సంబంధించి పోలీసుల విచారణలో బెంగళూరు స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (Suchana Seth) పలు అంశాలను వెల్లడించారు.
ముందే చనిపోయాడా?..
తన కుమారుడిని తాను హత్య చేయలేదని, తాను నిద్ర నుండి లేచి చూసేటప్పటికే తన కుమారుడు చనిపోయి ఉన్నాడని బెంగళూరు స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (Suchana Seth) పోలీసులకు తెలిపారు. తన కుమారుడంటే తనకు ఎంతో ప్రేమ అని, అకస్మాత్తుగా అతడు చనిపోవడంతో షాక్ కు గురయ్యానని, మృతదేహం పక్కనే చాలా సేపు కూర్చున్నానని ఆమె పోలీసులకు తెలిపారు. ఆ బాధలో తన చేతిపై కత్తితో గాయం కూడా చేసుకున్నానని చెప్పారు. అయితే, ఆమె వాదనను పోలీసులు విశ్వసించడం లేదు.
ఖాళీ కాఫ్ సిరప్ బాటిల్స్..
గోవా (Goa) లో ఆమె (Bengaluru Start up CEO) ఉన్న సర్వీస్ అపార్ట్ మెంట్ లో ఖాళీ దగ్గు మందు సీసాలను పోలీసులు గుర్తించారు. ఓవర్ డోస్ కాఫ్ సిరప్ ఇచ్చి, పిల్లవాడు మత్తులోకి వెళ్లిన తరువాత, హత్య చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఊపిరి ఆడకుండా చేయడం వల్ల ఆ బాలుడు చనిపోయాడని పోస్ట్ మార్టం నివేదికలో కూడా తేలింది. నిద్ర పోతున్న పిల్లవాడి ముఖంపై ఆమె దిండుతో బలంగా అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఆ రక్తపు మరకలు..
గోవాలో ఆమె ఉన్న సర్వీస్ అపార్ట్ మెంట్ లో కనిపించిన రక్తపు మరకలపై కూడా ఆమె వివరణ ఇచ్చారు. అవి తన మంత్లీ పీరియడ్ కు సంబంధించిన రక్తపు మరకలని ఆమె పోలీసులకు తెలిపారు. తన కుమారుడి గురించి మొదట పోలీసులు ఫోన్ లో ప్రశ్నించినప్పుడు, అతడు దక్షిణగోవాలోని మార్గావ్ లో ఉన్న తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని అబద్ధం ఎందుకు చెప్పారని పోలీసులు ఆమెను ప్రశ్నించారు. దానికి ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. పోలీసుల దర్యాప్తులో ఆమె తప్పుడు అడ్రస్ ఇచ్చిందని తేలింది.
భర్తతో గొడవల వల్లనేనా?
అయితే, తన నాలుగేళ్ల కొడుకును ఆమె హత్య చేయడానికి కారణమేంటనే విషయం ఇంకా తేలలేదు. భర్తతో విబేధాల కారణంగానే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది ప్రి ప్లాన్డ్ హత్యేనని పోలీసులు భావిస్తున్నారు. గోవాలోని కాండోలిమ్లోని అపార్ట్మెంట్లో తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసిన అనంతరం సుచనా సేథ్ సోమవారం రాత్రి గోవా నుంచి బెంగుళూరుకు వెళుతుండగా పొలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తన వెంట తీసుకెళ్లిన సూట్కేస్లో బాలుడి మృతదేహం లభ్యమైంది.