Mughal Gardens renamed: మొఘల్ గార్డెన్స్ కు కొత్త పేరు పెట్టిన రాష్ట్రపతి
28 January 2023, 18:00 IST
Mughal Gardens renamed: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు అందం మొఘల్ గార్డెన్స్. ఈ చారిత్రాత్మక మొఘల్ గార్డెన్స్ పేరును కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చారు.
అమృత్ ఉద్యాన్ గా పేరు మార్చుకున్న మొఘల్ గార్డెన్
Mughal Gardens renamed: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉండే మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్’ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చారు. మొఘల్, బ్రిటిష్ కాలం నాటి ప్రముఖ కట్టడాలు, నిర్మాణాల పేర్లను ప్రస్తుత మోదీ ప్రభుత్వం క్రమంగా మారుస్తున్న సంగతి తెలిసిందే.
Mughal Gardens renamed: అమృత్ ఉద్యాన్
రాష్ట్రపతి భవన్ వద్ద ఉండే మొఘల్ గార్డెన్స్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. అరుదైన, అందమైన పుష్ప జాతులతో విలసిల్లే ఈ తోట పేరును ‘మొఘల్ గార్డెన్స్‘ నుంచి ‘అమృత్ ఉద్యాన్’ గా మార్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఈ తోటలోకి జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సందర్శకులను అనుమతించనున్నారు. అలాగే, కొన్ని రోజులను దివ్యాంగులు, మహిళలు, రైతులు, పిల్లల కోసం రిజర్వ్ చేయనున్నారు.
Mughal Gardens renamed: 15 ఎకరాల్లో..
అమృత్ ఉద్యాన్ గా పేరు మార్చుకున్న మొఘల్ గార్డెన్ రాష్ట్రపతి భవన్ వద్ద 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. జమ్మూకశ్మీర్ లోని మొఘల్ గార్డెన్, తాజ్ మహల్ ముందున్న మొఘల్ గార్డెన్ తరహాలో ఇది ఉంటుంది. 1917లో సర్ ఎడ్విన్ ల్యూటెన్స్ ఈ మొఘల్ గార్డెన్స్ డిజైన్ ను ఆమోదించారు. అయితే, 1929లో ఇక్కడ పూల మొక్కలను నాటడం ప్రారంభించారు. మొఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చడాన్ని బీజేపీ ప్రశంసించింది. ఇది మోదీ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అభివర్ణించారు. బానిస మనస్తత్వం నుంచి బయటపడేందుకు అమృత కాలంలో తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు.