US bridge Collapse: యూఎస్ లో బాల్టిమోర్ వంతెన కుప్పకూలడానికి కారణమైన షిప్ లో సిబ్బంది అంతా భారతీయులే
26 March 2024, 20:55 IST
US bridge Collapse: అమెరికాలో మంగళవారం తెల్లవారుజామున బాల్టిమోర్ లోని ప్రధాన వంతెనను ఢీకొన్న నౌకలో విధుల్లో ఉన్న సిబ్బంది అంతా భారతీయులేనని ఆ నౌక యాజమాన్య సంస్థ ప్రకటించింది. అయితే, ఆ ప్రమాదం అనంతరం సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.
నౌక ఢీ కొనడంతో కుప్పకూలిన అమెరికాలోని బాల్టిమోర్ వంతెన
అమెరికాలో మంగళవారం తెల్లవారుజామున బాల్టిమోర్ లోని ప్రధాన వంతెనను ఢీకొట్టి కింద నదిలో పడిపోయిన కార్గో నౌకలోని మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని కంపెనీ తెలిపింది. ఇద్దరు పైలట్లు సహా సిబ్బందిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని షిప్ మేనేజ్ మెంట్ కంపెనీ సినర్జీ మెరైన్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రీలంక వెళ్తుండగా..
అమెరికా స్థానిక కాలమానం ప్రకారం, మంగళవారం ఉదయం తెల్లవారు జామున 1:27 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 10:57 గంటలకు) కంటైనర్ నౌక 'డాలీ' పటాప్స్కో (Patapsco River) నదిపై బాల్టిమోర్ వంతెన (Baltimore bridge) పైలాన్ ను ఢీకొన్నది. దాంతో, ఆ వంతెన పాక్షికంగా కూలిపోయి, పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ నౌక శ్రీలంకకు వెళ్తున్నట్లు సమాచారం. ఆ కంటైనర్ షిప్ గ్రేస్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ కింద రిజిస్టర్ అయి ఉంది. ఆ నౌకపై సింగపూర్ జెండా ఎగురుతోంది.
నదిలో పడిపోయిన సిబ్బంది
నౌక బాల్టిమోర్ వంతెనను ఢీ కొని పాక్షికంగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదం అనంతరం నౌకలో మంటలు చెలరేగాయని సమాచారం. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో నౌక పై నుంచి కొందరు సిబ్బంది కింద నదిలో పడిపోయారు. ఆ సమయంలో నదిలోని నీటి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్ గా ఉన్నాయి. ఆ నీటిలో పడిపోయిన సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్లు కంపెనీ వెల్లడించింది.
వంతెన పై వాహనాలు నదిలో..
నౌక ఢీ కొనడంతో బాల్టిమోర్ వంతెన కుప్పకూలింది. దాంతో, ఆ సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు కింద నదిలో పడిపోయాయి. వాహనాలు కింద నీటిలో పడిపోతున్న దృశ్యాలను కొందరు వీడియో తీశారు. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా? అన్న విషయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.