తాలిబన్లపై అఫ్గాన్ మహిళల తిరుగుబాటు..! ఆ రూల్పై కోపంతోనే..
22 May 2022, 19:08 IST
- Afghan tv presenter | తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్ మహిళలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రకరకాల ఆంక్షలతో తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. న్యూస్ రీడర్లు.. ముఖానికి హిజాబ్ కప్పుకుని వార్తలు చదవాలన్న ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా అక్కడి మహిళల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. 'పోరాడతాము' అంటూ వారు నినాదాలు చేస్తున్నారు.
అఫ్గాన్ న్యూస్ రీడర్
Afghan tv presenter | అఫ్గానిస్థాన్ను దక్కించుకున్న తాలిబన్లు.. ఇష్టానుసారంగా ఆదేశాలు జారీ చేస్తూ.. అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై ఆంక్షలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మహిళలు.. బహిరంగ ప్రదేశాల్లో ముఖాలు కప్పుకోవాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది తాలిబన్ ప్రభుత్వం. ఇది.. అఫ్గాన్ వార్తా సంస్థల్లో పనిచేస్తున్న న్యూస్ రీడర్లకు సైతం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. తమ హక్కుల కోసం పోరాడతామని న్యూస్ రీడర్లు తేల్చిచెబుతున్నారు.
‘బలంవంతం చేశారు..’
న్యూస్ రీడర్లు ముఖానికి హిజాబ్ వేసుకోవాలని ఇటీవలే ఆదేశాలు అందాయి. శనివారం వరకు ఎవరు వేసుకోలేదు. కానీ ఆదివారం నాడు.. అన్ని ప్రముఖ వార్తా సంస్థల్లోని మహిళా న్యూస్ రీడర్లు పూర్తి హిజాబ్తో కనిపించారు. కేవలం కళ్లు మాత్రమే కనిపించే విధంగా హిజాబ్ ధరించి.. న్యూస్ చదివారు.
దీనిపై న్యూస్ రీడర్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
"మా మీద ఈరోజున ఆంక్షలు రుద్దారు. కానీ మేము వెనకడుగు వేయము. మా హక్కుల కోసం పోరాడతము. ఈ ఆదేశాలతో నేను ఏడవను. అఫ్గాన్ బాలికల గంతుగా నిలిచి పోరాడతాను. ఇలా చేస్తే.. మహిళా జర్నలిస్టులు ఉద్యోగాలు వదిలేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. కానీ అలా జరగదు. బలవంతంగా మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే తప్ప.. మేము మా పని చేసుకుంటూనే ఉంటాము," అని టీఓఎల్ఓ న్యూస్ రీడర్ సోనియా నైజి వెల్లడించారు.
Taliban new rules | "మా ఇష్టంతో హిజాబ్ వేసుకోలేదు. బలవంతం చేశారు కాబట్టే ధరించాము. తాలిబన్ల పాలనలో పని చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ మేము పోరాడతాము," అని మరో న్యూస్ ప్రెజంటర్ తెలిపారు.
గతంలో మహిళా న్యూస్ రీడర్లు కేవలం హెడ్స్కార్ఫ్లు మాత్రమే ధరించే వారు. ఇక ఇప్పటి నుంచి పూర్తిగా హిజాబ్ ధరించడం తప్పడం లేదు.
కాగా.. మహిళా జర్నలిస్టులకు సానుభూతిగా.. పురుషులు మాస్క్ వేసుకునే న్యూస్ చదివారు.
'మాకు ఆ ఉద్దేశం లేదు..'
ఈ వ్యవహారంపై తాలిబన్ల ప్రతినిధి అకీఫ్ సాదిఖ్ స్పందించారు. మీడియా ఛానెళ్లు.. తమ ఆదేశాలను పాటిస్తుండటం సంతోషకరం అన్నారు. మహిళా న్యూస్ రీడర్లకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. మహిళల హక్కులను హరింపజేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
కాగా ఈ ఆదేశాలు మీడియాలోనే కాకుండా.. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా జారీ అయ్యాయి. మహిళలు కచ్చితంగా.. పూర్తిగా హిజాబ్ ధరించాలని చెబుతున్నారు. ఒక వేళ ఆదేశాలను అతిక్రమిస్తే.. వారి భర్తలు, తండ్రులపై.. సస్పెన్షన్ వేటు పడుతుందని హెచ్చరిస్తున్నారు.
'మహిళలు.. పురుషులు వేరువేరుగా..'
Afghanistan crisis | ఆకలి, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగంతో విలవిలాడుతున్న అఫ్గానిస్థాన్.. తాలిబన్ల ఆంక్షలు, కఠిన నిబంధనలతో ఉక్కిరిబిక్కరి అవుతోంది. తాజాగా.. తాలిబన్లు విధించిన ఓ నిబంధన వెలుగులోకి వచ్చింది. హోటళ్లకు వెళితే, పురుషులు- మహిళలు కలిసి కూర్చోకూడదని ఆదేశాలు జారీ చేసింది తాలిబన్ ప్రభుత్వం.
పురుషులు.. కుటుంబసభ్యులతో రెస్టారెంట్లకు వెళ్లొచ్చని, కానీ వారితో కలిసి భోజనం చేయకూడదని తాలిబన్ మినిస్ట్రీ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ శాఖ.. ఆదేశాలిచ్చింది. అది ఇప్పటికే అమల్లోకి వచ్చింది. భార్యభర్తలే అయినప్పటికీ.. ఇద్దరు కలిసి ఒకేచోట కూర్చోకూడదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని అఫ్గాన్లోని ఖామ్ ప్రెస్ వార్తా సంస్థ వెల్లడించింది.
"హెరాత్ రాష్ట్రంలోని ఓ రెస్టారెంట్కు.. నేను నా భర్తతో కలిసి వెళ్లాను. మా ఇద్దరిని వేరువేరు చోట్ల కూర్చోబెట్టారు. తాలిబన్ల ఆదేశాలని చెప్పారు," అని ఓ మహిళ వెల్లడించింది.
అంతేకాదు.. హెరాత్లోని పార్కుల్లో కూడా పురుషులు, మహిళలను వేరుచేసేసింది తాలిబన్ ప్రభుత్వం. మహిళలు గురువారం, శుక్రవారం, శనివారం మాత్రమే పార్కులకు వెళ్లాలి. అప్పుడు పురుషులకు అనుమతి ఉండదు. మిగిలిన రోజుల్లో పురుషులు ఎప్పుడైనా పార్కులకు వెళ్లొచ్చు.