Aadhaar details leak: డార్క్ వెబ్ లో మీ ఆధార్ డేటా; ఇదే అతి పెద్ద డేటా లీక్
31 October 2023, 16:08 IST
Aadhaar details leak: కొరోనా సమయంలో కోవిడ్ 19 (covid 19) నిర్ధారణ పరీక్షల కోసం ఐసీఎంఆర్ (ICMR) సేకరించిన పౌరుల ఆధార్ వివరాలను దొంగలించారు. ప్రస్తుతం అవి డార్క్ వెబ్ లో అందుబాటులో ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
Aadhaar details leak: దాదాపు 81.5 కోట్ల మంది ఆధార్ వివరాలను అక్రమంగా సేకరించారు. భారత్ లో ఇదే అతి పెద్ద డేటా లీక్ గా భావిస్తున్నారు. కొరోనా సమయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ఐసీఎంఆర్ (ICMR) సేకరించిన పౌరుల ఆధార్ (Aadhaar) వివరాలు అందులో ఉన్నాయి. పౌరుల ఆధార్ లోని వ్యక్తిగత వివరాలను డార్క్ వెబ్ లో పెట్టారు. కొరోనా సమయంలో కోవిడ్ నిర్ధారణ కోసం పరీక్షలు జరిపే సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పౌరుల నుంచి ఆధార్ కాపీ ని తీసుకున్నారు. ఇప్పుడు ఆ వివరాలు లీక్ అయ్యాయి. దాంతో, దాదాపు 81.5 కోట్ల మంది భారత పౌరుల వివరాలు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాయి.
ఎలా గుర్తించారు?
ఈ అత్యంత భారీ లీక్ ను మొదట అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటలిజెన్స్ సంస్థ రీ సెక్యూరిటీ (Resecurity) గుర్తించింది. పీడబ్ల్యూఎన్001 (pwn001) ఐడీతో బ్రీచ్ ఫోరమ్స్ (Breach Forums) అనే డేటా లీకేజ్ డిస్కషన్ ఫోరమ్ లో ఈ డేటా థ్రెడ్ ను పోస్ట్ చేశారని ఆ సంస్థ ప్రకటించింది. ఇదే విషయాన్ని పీడబ్ల్యూఎన్001 (pwn001) తన ట్విటర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. దాంతోపాటు, 4 ఎక్సెల్ షీట్లలో కొంత మంది డేటాను కూడా పోస్ట్ చేశారు. ఈ డేటా లీక్ తో దాదాపు 81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ నంబర్స్, పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు డార్క్ వెబ్ లో అందుబాటులోకి వచ్చాయి.
ప్రభుత్వ స్పందన
ఈ భారీ డేటా లీక్ ను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని సమాచారం. తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో పాటు, ఐసీఎంఆర్ నుంచి వివరణ కోరిందని తెలిసింది. ఈ లీక్ పై సీబీఐ తో విచారణ జరిపించే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. అయితే, ఈ వార్తపై ఐసీఎంఆర్ ఇప్పటివరకు స్పందించలేదు.