బాలికపై గ్యాంగ్ రేప్.. కేసు పెట్టేందుకు వెళ్తే పోలీసు అధికారి కూడా...
05 June 2022, 10:29 IST
- యూపీలో దారుణం వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలికపై దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అయితే ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్ కు వెళ్లిన బాధితురాలిపై అక్కడి పోలీసు అధికారి కూడా అత్యాచారానికి ఒడిగట్టడం సంచలనం సృష్టించింది.
యూపీలో 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
ఉత్తర్ ప్రదేశ్ లో అత్యంత అమానవీయ ఘటన వెలుగు చూసింది. దుండగుల చేతిలో రేప్ కు గురై.. ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్ కు వెళ్తే కూడా అక్కడ మరోసారి అత్యాచారానికి గురైంది. ఈ దారుణ ఘటన లలిత్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు అధికారిపై వేటు వేశారు ఉన్నతాధికారులు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించారు.
ఏం జరిగిందంటే....
ఏప్రిల్ 22న 13 ఏళ్ల బాలికను నలుగురు దుండగులు అపహరించారు. భోపాల్ కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక... స్వగ్రామానికి చేరుకుంది. ఈ దారుణంపై పాలి పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అక్కడ ఎస్ హెచ్ వో దారుణానికి ఒడిగట్టాడు. గదిలోకి తీసుకెళ్లిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ వ్యవహరాన్ని ఓ ఎన్జీవో సంస్థ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అసలు మేటర్ బయటికి వచ్చింది.
ఎస్ హెచ్ వో పై వేటు...
ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఎస్ హెచ్ వో పై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సదరు అధికారిపై ఎఫ్ ఐఆర్ నమోదు కాగా విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ పోలీసు స్టేషన్ లోని అందర్నీ విధుల నుంచి తొలగించారు. ఇక బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నలుగురిలో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అట్రాసిటీ, పోస్కోతో పాటు ఐపీసీ 376, 376బీ, 363, 12బీ సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు లలిత్ పూర్ ఎస్పీ నిఖిల్ పాఠక్ వెల్లడించారు.
కాంగ్రెస్, ఎస్పీ సీరియస్..
13 ఏళ్ల రేప్ ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ.. యోగి సర్కార్ పై నిప్పులు చెరిగారు. బుల్డోజర్ పాలనలో తీసుకువచ్చిన సంస్కరణలు ఇవేనా అంటూ ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ లోనే మహిళలకు రక్షణ లేకుంటే.. ఫిర్యాదులు ఎక్కడ ఇవ్వాలంటూ నిలదీశారు. ప్రతిపక్ష సమాజ్ వాదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉంది.
టాపిక్