Tips and Tricks : పండ్లు, కూరగాయలను ఇలా రసాయన రహితంగా చేయండి
27 January 2024, 10:00 IST
- Remove Pesticides Tips : ఈ కాలంలో మనం తినే కూరగాయలు, పండ్లు అంతా రసాయనలు ఉండేవే. అయితే వాటి మీద నుంచి రసాయనాలు తొలగించేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
పండ్లు, కూరగాయలు కడిగేందుకు చిట్కాలు
మార్కెట్కు వెళ్తాం.. కూరగాయలు, పండ్లు తీసుకొస్తాం. కొంతమంది వాటిని కడిగితే.. మరికొందరేమో.. నీటిలో కాస్త అటు ఇటు అనేసి.. వండేస్తారు, పండ్లైతే తినేస్తారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే తెలియకుండానే మన కడుపులోకి రసాయనాలను పంపిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నిజానికి మార్కెట్లోని చాలా పండ్లు, కూరగాయలు పురుగుమందులు, రసాయనాలతో నిండి ఉంటాయి. ఆర్గానిక్ దొరకడం కష్టం. రసాయనాలు ఉన్న పండ్లు, కూరగాయలు శరీరానికి మంచిది కాదు. ఈ విషయం మనకు తెలిసినా.. తప్పని పరిస్థితుల్లో వాటిని తింటున్నాం. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, తప్పనిసరిగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. కానీ కెమికల్తో కూడిన పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. వాటిని తొలగించేందుకు చిట్కాలు పాటించాలి.
పండ్లు, కూరగాయల నుండి పురుగుమందులు, రసాయనాలను తొలగించేందుకు కేవలం నీటిలో కడగడం సరిపోదు. ఇది కాకుండా మరికొన్ని టిప్స్ పాటించాలి. పండ్లను రసాయనాల నుండి విముక్తి చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలను తెలుసుకోవాలి.
పండ్లు, కూరగాయలను మెుదట నీటిలో బాగా కడగాలి. వాటిపై అంటుకున్న దుమ్ము, ధూళిని శుభ్రం చేయాలి. బంగాళదుంపలు వంటి కూరగాయలు, ఆకుకూరలు వంటి పండ్లు తరచుగా వాటిపై మురికిని అంటుకుంటాయి. తినే ముందు చల్లటి నీటితో కడగాలి.
పండ్లు, కూరగాయలను ఉప్పు నీటిలో కాసేపు నానబెట్టాలి. అనంతరం మళ్లీ శుభ్రమైన నీటితో కడగాలి. ఇది కూరగాయలపై ఉన్న దుమ్ము, ధూళి, రసాయనాలు, పురుగుమందులను శుభ్రం చేస్తుంది. అంతేకాదు.. ఉప్పుకు బ్యాక్టీరియాను నాశనం చేసే శక్తి ఉంది.
పండ్లు, కూరగాయలను పొట్టు తీసి తినడం కూడా ఓ పద్ధతి ఉంది. ఇది పొట్టులోని మురికిని తొలగించడమే కాకుండా, పండ్లు, కూరగాయలపై స్ప్రే చేసిన రసాయనాలను కూడా తొలగిస్తుంది.
నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి పండ్లు, కూరగాయలను బాగా కడగాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల కూరగాయలలో ఉండే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా నాశనమైపోతాయి.
రసాయనాలు, పురుగుమందులను తొలగించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. ఒక గిన్నెలో నిమ్మరసం, బేకింగ్ సోడా, నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని పండ్లు, కూరగాయలపై స్ప్రే చేయాలి. పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
పసుపు మురికిని, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఒక టీస్పూన్ పసుపు పొడిని నీటిలో వేసి ఈ మిశ్రమంలో పండ్లు, కూరగాయలను ముంచండి. తర్వాత మంచి నీటితో కడుక్కోవాలి.
రసాయనాలను తొలగించడానికి మరొక పరిష్కారం వెనిగర్ కలిపిన నీటిలో పండ్లు, కూరగాయలను పెట్టడం. ఒక పెద్ద గిన్నెలో నీరు తీసుకుని 1 టీస్పూన్ వైట్ వెనిగర్ మిక్స్ చేసి అందులో పండ్లు, కూరగాయలను 20 నిమిషాలపాటు నానబెట్టాలి. అనంతరం నీటితో కడగాలి. వెనిగర్ రసాయనాలు, పురుగుమందులను కొంతవరకు తొలగిస్తుంది.